Share News

Floods: విలయవాడ!

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:36 AM

ఏపీలోని విజయవాడ నగరంపై బుడమేరు దండెత్తింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించింది.

Floods: విలయవాడ!

  • విజయవాడను ముంచేసిన బుడమేరు

  • కృష్ణమ్మ మహోగ్రం.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ

  • ‘నైరుతి’పై కుంభవృష్టి!

  • అంతే తప్ప ఇది క్లౌడ్‌ బరస్ట్‌ కాదు

  • ఆగస్టులో తీవ్ర ఎండలు.. వేడెక్కిన సముద్రం

  • సముద్ర నీటిని తాగేసిన వాయుగుండం

  • ఐదు నుంచి 8 అడుగుల వరకు మునక

  • కలవరపెడుతున్న మహోగ్ర కృష్ణమ్మ

  • 2009 తర్వాత మరోసారి భారీ ప్రవాహం

విజయవాడ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని విజయవాడ నగరంపై బుడమేరు దండెత్తింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించింది. పదులసంఖ్యలో కాలనీలను చుట్టుముట్టి విజయవాడను విలయవాడగా మార్చేసింది. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం... ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి ఏకాధాటిగా కురిసిన వాన శనివారం సాయంత్రానికి ఉపశమించంతో నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ, కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి పొర్లింది. అప్పటికే కృష్ణమ్మ భారీగా ప్రవహిస్తుండటంతో.. బుడమేరు చానల్‌ నుంచి నదిలోకి నీరు కలిసే అవకాశం లేకపోయింది. పైగా... కృష్ణా నది నీరు కూడా ఎగదన్నింది. దీంతో బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది. ఫలితంగా బుడమేరును ఆనుకుని ఉన్న జక్కంపూడి కాలనీ, అజిత్‌సింగ్‌ నగర్‌, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, అయోధ్యనగర్‌, దేవీనగర్‌, రాజీవ్‌నగర్‌, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, చిట్టినగర్‌, పాల ఫ్యాక్టరీ, కబేళా, ఉర్మిళా నగర్‌, పాయకాపురం, భవానీపురం ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.


ఆయా ప్రాంతాల్లో ఐదు నుంచి ఎనిమిది అడుగుల మేరకు నీరు చేరడంతో ఆ ప్రాంతం జలసంద్రాన్ని తలపించింది. ఆదివారం ఉదయానికే అపార్టుమెంట్లు సెల్లార్‌లలోకి నీరు ప్రవేశించింది. తర్వాత కాసేపటికి అపార్టుమెంట్ల మొదటి అంతస్తు వరకు చేరింది. సుమారు 2 లక్షల మంది వరదనీటిలో చిక్కుకున్నారు. అజిత్‌సింగ్‌ నగర్‌, పాయకాపురం ప్రాంతాలను ఏకంగా 8 అడుగుల మేరకు ముంచెత్తింది. ఇతర ప్రాంతాల్లో ఐదు నుంచి ఎనిమిది అడుగుల మేర నీళ్లు నిలిచాయి. జక్కంపూడిలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు మొదటి అంతస్తు వరకు మునిగిపోయాయి. ఇక, విజయవాడ సమీపంలోని గ్రామాలపైనా బుడమేరు ప్రభావం పడింది. ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు, కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, కొండపల్లి ఇందిరమ్మ కాలనీ, ఇబ్రహీంపట్నం ఖాజీ మాన్యంలోకి వరద నీరు వచ్చి చేరింది. వేలాది ఎకరాల భూములు నీటమునిగాయి.


రాయనపాడు వద్ద రైల్వేట్రాక్‌పైకి వరద నీరు చేరడంతో తమిళనాడు, గోదావరి, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. బుడమేరు ఈస్థాయిలో దండెత్తడం మాత్రం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. మున్నేరు వాగు నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిని ముంచెత్తింది దీంతో హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను చిల్లకల్లు వద్ద, విజయవాడ వైపు నుంచి వెళ్లే వాహనాలను కీసర వద్ద నిలిపివేశారు. ఇక... 2009 తర్వాత కృష్ణమ్మ మరోసారి భీకరావతారం దాల్చింది. ఆదివారం రాత్రికే ప్రకాశం బ్యారేజీ నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. తెల్లవారేసరికి ఇది పది లక్షల క్యూసెక్కులు దాటే అవకాశముంది. ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.


  • జలదిగ్బంధంలో ఏపీ జిల్లాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం భ్రావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురు స్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థ మైం ది. దీనికితోడు ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో ఆయా జిల్లాల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో సోమవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రకాశం జిల్లాలోని పలు దాదాపు అన్ని ప్రాంతాలూ నీట మునిగాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో జన జీవనం స్తంభించింది.


  • మునిగిన కృష్ణా మిల్క్‌.. 70 కోట్ల నష్టం

భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు రూ.70 కోట్ల నష్టం వాటిల్లింది. విజయవాడ కొత్తపేటలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పాల ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ పాల సేకరణతోపాటు పాల పదార్థాలు తయారుచేసే ప్లాంట్లు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీకి కొంతదూరం నుంచి బుడమేరు కాల్వలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొత్తపేట, ఫ్యాక్టరీ ప్రాంతాలు నీట మునిగాయి. ఫ్యాక్టరీలోకి 5అడుగుల మేరకు నీరు చేరింది. ఫ్రిజ్‌లు మొత్తం ఆగిపోయి పదార్థాలు పాడైపోవడంతో రూ.70 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఎండీ కె.ఈశ్వరరావు, చైర్మన్‌ చలసాని ఆంజనేయులు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 04:36 AM