Share News

Telangana Politics: ఆ రెండు సీట్లపైనే ఉత్కంఠ.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే..

ABN , Publish Date - May 27 , 2024 | 04:26 PM

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ రాజకీయపార్టీల్లో కొనసాగుతోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం మినహిస్తే మిగిలిన 16 నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ధీమాగా ఉన్నాయి.

Telangana Politics: ఆ రెండు సీట్లపైనే ఉత్కంఠ.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే..
BJP and Congress

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ రాజకీయపార్టీల్లో కొనసాగుతోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం మినహిస్తే మిగిలిన 16 నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ధీమాగా ఉన్నాయి. ఈ 16 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు చోట్ల పోరు హోరాహోరీగా జరగడంతో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సర్వే సంస్థలకు సైతం ఇక్కడి ఫలితం అంతుబట్టడంలేదట. అవే మహబూబ్‌నగర్, భువనగిరి. ఈ రెండు నియోజకవర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం సీఎం సొంత జిల్లా కాగా.. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్ రెడ్డి రేవంత్‌కు దగ్గర వ్యక్తిగా ఉన్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా గెలిచేందుకు హస్తం పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉండటంతో మహబూబ్‌నగర్, భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోటీ జరిగిందని.. ఎవరు గెలిచినా 10 నుంచి 20 వేల లోపు మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Hyderabad: వేలం గ్యారెంటీ...


మహబూబ్‌నగర్‌పై అందరి దృష్టి..

మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డీకే అరుణ పోటీ చేశారు. డీకే అరుణకు జిల్లాపై మంచి పట్టుఉండటంతో పాటు.. ప్రజల్లో ఉండే మనిషిగా గుర్తింపు ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. అవే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన వంశీచందర్ రెడ్డి లక్షా 93 వేల 631 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. డీకే అరుణ 70వేలకు పైగా ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి చెందారు. డీకే అరుణకు, వంశీ చందర్‌రెడ్డి మధ్య దాదాపు లక్షా 40 వేల ఓట్ల తేడా ఉంది. ఈ ఎన్నికల్లో డీకే అరుణ, వంశీచందర్‌ రెడ్డి మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వంశీచందర్‌ రెడ్డి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. విజయంపై ఇద్దరు నేతలు ధీమాతో ఉన్నారు. డీకే అరుణ స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం ఉందని కొందరు అంచనావేస్తే.. వంశీ చందర్‌రెడ్డి గెలిచే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.


భువనగిరిపై ఆసక్తి..

భువనగిరి లోక్‌సభ స్థానంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిరేపుతోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత ఓటర్లు అధికంగా ఉంటారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని అంతా అంచనావేశారు. కానీ బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను రంగంలోకి దింపడంతో ఆయన కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన చామల కిరణ్‌కుమార్ రెడ్డి్కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఈ నియోజకవర్గంలో విజయం కోసం కొంచెం ఎక్కువుగా కష్టపడాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకులు కొందరు బహిరంగంగానే చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. భువనగిరిలో బీసీ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువుగా ఉంటారు. బూర నర్సయ్యగౌడ్‌ బీసీ కావడంతో ఆ వర్గం ఓట్లు తమకు పడతాయని బీజేపీ ఆశిస్తోంది. బీసీ ఓట్లలో ఎక్కువశాతం తనకే పడతాయని.. గెలవడం సులువని బూర నర్సయ్యగౌడ్‌ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. గెలుపుపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. లోలోపల ఓటమి భయం వెంటాడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారనేది జూన్4న తేలనుంది.


Hyderabad: మళ్లీ కోతలు ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Telangana News and Telugu News

Updated Date - May 27 , 2024 | 04:26 PM