Share News

Nalgonda: ‘యాదాద్రి ప్లాంట్‌’ దొంగల ముఠా పట్టివేత..

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:33 AM

ఏడాదిగా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (వైటీపీఎ్‌స)లో యంత్ర పరికరాలు, జీఐ బండిల్స్‌, అల్యూమినియం షీట్లు ఏడాదిన్నరగా చోరీ అవుతున్నాయి. వైటీపీఎ్‌సలో చొరబడుతున్న దొంగలు, విలువైన వస్తువులను స్ర్కాప్‌గా అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలొచ్చాయి.

Nalgonda: ‘యాదాద్రి ప్లాంట్‌’ దొంగల ముఠా పట్టివేత..

  • ఏడాదిగా విలువైన పరికరాల చోరీ.. హైదరాబాద్‌ విక్రయం

  • రూ.1.49కోట్ల సామగ్రి, నగదు స్వాధీనం.. 11 మంది అరెస్టు

  • చోరీకి గతంలో అక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి సహకారం?

నల్లగొండ, మే 31: ఏడాదిగా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (వైటీపీఎ్‌స)లో యంత్ర పరికరాలు, జీఐ బండిల్స్‌, అల్యూమినియం షీట్లు ఏడాదిన్నరగా చోరీ అవుతున్నాయి. వైటీపీఎ్‌సలో చొరబడుతున్న దొంగలు, విలువైన వస్తువులను స్ర్కాప్‌గా అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలొచ్చాయి. ఈ చోరీ కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. చోరీకి సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి రూ.71 లక్షల విలువైన నాలుగు జీఐ బండిల్స్‌ను, రూ.58లక్షల నగదును, రూ.20లక్షల విలువైన ఓ బెలినో కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను మొత్తం రూ.1.49 కోట్ల విలువైన వస్తువులను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన వైటీపీఎస్‌ ప్రాజెక్టులో భారీ నిర్మాణాలు జరుగుతుండగా, అందుకు అవసరమైన పరికరాలను ఆ ప్రాజెక్టు ప్రాంతంలో నిల్వ ఉంచారు. ఏడాదిన్నర కాలంగా ఈ పరికరాలు భారీ ఎత్తున చోరీకి గురికావడం గమనించిన నిర్మాణ కంపెనీ బీహెచ్‌ఈఎల్‌, ఇతర నిర్మాణ సంస్థలు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాయి.


ఈ మేరకు మూడు కేసులను నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. తమ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ రూరల్‌ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్‌ఐ రవి, వేములపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, మాడ్గులపల్లి ఎఎస్సై శోభన్‌బాబు, వాడపల్లి పీఎస్‌ సిబ్బంది, సీసీఎస్‌ కానిస్టేబుల్‌ విష్ణులతో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి వారం రోజులుగా చేసిన విచారణతో మూడు కేసులను నమోదు చేశామని.. మిర్యాలగూడకు చెందిన షేక్‌ మహ్మద్‌, షేక్‌ మునీర్‌, షేక్‌ రజాక్‌, మహ్మద్‌ జానీ, మంద మహేశ్‌, దామరచర్ల మండలం ఇరికిగూడెంకు చెందిన కంబాల అశోక్‌, అదే మండలం వీర్లపాలెంకు చెందిన మంద శ్రీను, వాడపల్లికి చెందిన మహ్మద్‌ అఫ్రోజ్‌, వీర్లపాలెంకు చెందిన మంద నాగేందర్‌బాబు, యూపీకి చెందిన అమిత్‌కుమార్‌ భరద్వాజు, రవీంద్ర ప్రసాద్‌ అనే వ్యక్తులను అరెస్టు చేశామని వెల్లడించారు. వీరు వైటీపీఎస్‌ ఆవరణలోకి డీసీఎంలను పంపి క్రేన్‌ ఆపరేటర్‌ సహకారంతో చోరీ చేసిన పరికరాలను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన షరీఫుద్దీన్‌కు విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి పోలీస్‌ కస్టడీ ద్వారా మిగతా విచారణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఉన్నారో విచారణ చేయాల్సి ఉందన్నారు.


ఓ పోలీస్‌ అధికారి హస్తం?

చోరీ ముఠాకు గతంలో పవర్‌ప్లాంట్‌లో విఽధులు నిర్వహించిన ఓ పోలీస్‌ అధికారి అండదండలు అందించినట్లు చర్చ సాగుతోంది. అందుకు ప్రతిఫలంగా దొంగల నుంచి లక్షల్లో తీసుకున్నట్లు సమాచారం. సెక్యూరీటీ ఎస్సైగా విధులు నిర్వహించి సీఐగా పదోన్నతిపై బదిలీ అయిన అధికారి. తాను విధుల్లో ఉన్నప్పుడే విలువైన యంత్రపరికరాలను ముఠా సభ్యులు తరలించారని పలువురు ఆరోపిస్తున్నారు. బరువైన యంత్రాలను సైతం హైడ్రాలిక్‌ క్రేన్‌లతో అద్దె వాహనాల్లోకి లోడ్‌ చేసి ప్రధాన గేటు ద్వారానే తరలించినట్లు విమర్శలొస్తున్నాయి.

Updated Date - Jun 01 , 2024 | 04:33 AM