Srikalahasthi: నేటి నుంచి ముక్కంటి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Feb 21 , 2025 | 02:00 AM
శ్రీకాళహస్తీ శ్వరాలయ మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభంకాను న్నాయి.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీ శ్వరాలయ మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభంకాను న్నాయి. పరమశివుడి వరంతో కన్నప్పగా మారిన తిన్నడికి కొండపై స్థానమిచ్చి, కిందిభాగంలో దేవదేవుడు కొలువైన పుణ్యక్షేత్రమిది. దీంతో భక్తుడు కన్నప్పకు తొలిపూజ చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 14 రోజులు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో ప్రథమంగా కన్నప్ప ధ్వజారోహణం జరగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయ అలంకార మండపం నుంచి భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని కొండపైకి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అక్కడ వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా కన్నప్ప ధ్వజారోహణం మహాకత్రువును నిర్వహించి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఈ క్రమంలో కొండ, చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది.
ఆకట్టుకుంటున్న అలంకరణలు
భవుడి మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రధాన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, రంగ వల్లులతో అలంకరిం చారు. గోపురాలకు కొత్త రంగులద్ద డంతో. కళకళలాడుతున్నాయి. భక్తకన్నప్ప, రామసేతు వంతెన, పట్టణవ్యాప్తంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంక రణలు ఆకట్టుకుంటున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. చతుర్మాడ వీధులు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికైన ధూర్జటి కళా ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సన్నిధి వీధిలో కైలాసం సెట్టింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. రథాలు, నారద పుష్కరిణిలోని తెప్పలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, ఈవో బాపిరెడ్డి చేతులమీదుగా వీటిని ప్రారంభించనున్నారు.
ఉత్సవాల్లో నేడు...
తెల్లవారుజామున 4:30 గంటలకు మంగళ వాయిద్యాలు
ఉదయం 5గంటలకు గోపూజ, సుప్రభాతం, సర్వదర్శనం
6 గంటలకు ప్రధమ కాలాభిషేకం
7 గంటలకు ద్వితీయ కాలాభిషేకం
8 గంటలకు పరివార దేవతలకు నైవేద్యం, నిత్యోత్సవం
10 గంటలకు ఉచ్ఛికాలాభిషేకం
మధ్యాహ్నం 3 గంటలకు కన్నప్ప కొండకు స్వామి,
అమ్మవార్ల ఉత్సవమూర్తుల తరలింపు
సాయంత్రం 4 గంటలకు భక్తకన్నప్ప ధ్వజారోహణం
5 గంటలకు ప్రదోష కాలాభిషేకం
6 గంటలకు భక్తకన్నప్ప గ్రామోత్సవం
7 గంటలకు భక్తకన్నప్ప ఆలయ ప్రవేశం, స్వామి
అమ్మవార్లకు ధూపదీప, నైవేద్యం, మంత్రపుష్ప సమర్పణ
రాత్రి 8 గంటలకు మత్స్యగ్రహణం, అంకురార్పణ, వాస్తు శాంతి
రాత్రి 9 గంటలకు పళ్లియర పూజ, స్వామి దర్శనం ముగింపు