Share News

CPM : ఆకలి సూచీలో 106వ స్థానంలో భారత్‌

ABN , Publish Date - Feb 02 , 2025 | 05:20 AM

కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి దేశంలో ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వెల్లడించారు.

CPM : ఆకలి సూచీలో 106వ స్థానంలో భారత్‌

  • రైతుల ఆత్మహత్యలు.. ఆకలిచావులను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం: ఎంఏ బేబి

  • కేంద్రం హోదా ఇస్తే.. పరిశ్రమలు అవే వస్తాయి: వీఎస్‌ఆర్‌

  • నెల్లూరులో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మహాసభలు

నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచంలోని 127 దేశాల్లో ఆకలి సూచికలో భారతదేశం 106వ స్థానంలో ఉంది. కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి దేశంలో ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వెల్లడించారు. ఆపార్టీ 27వ రాష్ట్ర మహాసభలు శనివారం నెల్లూరులో ప్రారంభమయ్యాయి. మూడు రోజలపాటు ఈ సభలు జరిగే అనిల్‌ గార్డెన్స్‌కు సీతారాం ఏచూరి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి మాట్లాడుతూ... ‘దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూసీచూడనుట్లు వ్యవహరిస్తోంది. ఆర్థికవేత్తలు ఎన్ని సూచనలు చేసినా కేంద్రం తగిన విధంగా స్పందించకపోవటంతో గిరిజనులు, వెనుకబడిన వర్గాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఎనిమిదేళ్లలో 1,00,474 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 24 గంటలకు 34 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకుంటుంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పూర్తిగా ముస్లింలు ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడానికి కారణం... కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లను ఓట్లు వేయకుండా భయపెట్టింది. మరికొన్ని చోట్ల భయపెట్టి ఓట్లు వేయించుకుంది. వామపక్ష నేతలు అధికారంలో ఉన్న దేశాల్లో ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. ఆయా దేశాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.... ‘బీజేపీ, మతతత్వాన్ని రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెడుతోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏపీకి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు ప్రకటించారు.


ఆ నిధులు ఏమయ్యాయో సీఎం చంద్రబాబు స్పష్టం చేయాలి. ఈ నిధులే వచ్చి ఉంటే రాష్ట్రంలో టీడీపీ ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రూ.20 వేలు ఇవ్వవచ్చు కదా? అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హామీ కూడా అమలు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘దావోస్‌ వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిసి పరిశ్రమలు తెవడానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. ప్రత్యేక హోదాపై ఒత్తిడి చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్‌, పుణ్యవతి, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2025 | 05:20 AM