Share News

Raghurama Krishna Raju : నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించా

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:48 AM

గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఐదో కోర్టు మేజిస్ర్టేట్‌ లత ఎదుట ఆయన ఆదివారం హాజరయ్యారు. ఆమె సమక్షంలో గుంటూరు జిల్లా జైలులో....

Raghurama Krishna Raju : నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించా

  • అప్పట్లో తులసిబాబు ముఖానికి కట్టుకున్న కర్చీఫ్‌ జారింది

  • హత్యకు కుట్ర జరిగిందనడానికి నాటి కలెక్టర్‌ లేఖే ఆధారం: రఘురామ

  • పరారీలో ఉన్న ప్రభావతి ఏ కలుగులో దాగారో?

  • నిందితుడు సునీల్‌కుమార్‌ను ఇంకా ఎందుకు సస్పెండ్‌ చేయడం లేదో?

  • గుంటూరు జిల్లా జైలులో నిందితుడి గుర్తింపు ప్రక్రియకు రఘురామ హాజరు

గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): సీఐడీ కార్యాలయంలో తన గుండెలపై కూర్చున్న తులసిబాబును గుర్తుపట్టానని నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఐదో కోర్టు మేజిస్ర్టేట్‌ లత ఎదుట ఆయన ఆదివారం హాజరయ్యారు. ఆమె సమక్షంలో గుంటూరు జిల్లా జైలులో నిర్వహించిన నిందితుడి గుర్తింపు పరేడ్‌ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుతో పాటు అతనితో సరి సమానంగా ఉన్న మరో ఐదారుగురిలో ఆయన గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం జైలు బయట రఘురామ మీడియాతో మాట్లాడారు. తన ఎదుట నిలబడినవారిలో తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని తెలిపారు. ‘నా గుండెలపై కూర్చొని ఉన్న సమయంలో ఆయన ముఖానికి ఉన్న కర్చీఫ్‌ జారింది. అప్పట్లో తులసిబాబును దగ్గర్నుంచి చూడటంతో పరేడ్‌లో ఆయన్ను స్పష్టంగా గుర్తుపట్టాను. తులసిబాబు గురించి టీవీలో చూశా. తులసిదళం అని, గుడివాడలో ఎమ్మెల్యేను ఆయనే గెలిపించాడని అనేక రకాల వార్తలొచ్చాయి.


నాపై హత్యాయత్నం కేసులో నిందితుడికి గుడివాడ ఎమ్మెల్యే సహకారం అందించిన విషయాన్ని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌చూసుకుంటారని అనుకుంటున్నా. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పార్టీలో ఎటువంటి పదవి లేదని తెలిసింది. ఆయన్ను పార్టీకి దూరంగా ఉంచుతారేమోనని, సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమోనని భావిస్తున్నా. తులసిబాబు చరిత్ర గుడివాడ ప్రాంత వాసులకే కాకుండా ప్రకాశం జిల్లా వారికి బాగా తెలుసు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ కార్యాలయంలోకి ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా లోపలకు వెళ్లగలిగిన స్థాయి తులసిబాబుకు మాత్రమే ఉండేది. అతనితో పాటు నాపై దాడి చేసినవారిలో మరికొందరు అనుమానితులు ఉన్నారు’ అని రఘురామ పేర్కొన్నారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితురాలు, నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి పరారీలో ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఏ కలుగులో దాక్కున్నారోనని రఘురామరాజు అన్నారు. ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఆ పిటిషన్‌లో తాను కూడా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇదే కేసులో నిందితుడు విజయ్‌పాల్‌ తరహాలో ప్రభావతి కూడా పెద్ద లాయర్లను పెట్టుకుంటారేమో చూడాలని రఘురామ చెప్పారు.


లేఖ రాసిన నాటి కలెక్టర్‌ను విచారించాలి

హైదరాబాద్‌లో తనను అరెస్టు చేయడానికి కొద్ది గంటల ముందే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ రాసిన లేఖే తన హత్యకు కుట్ర జరిగిందనడానికి మరో ఆధారమని రఘురామ తెలిపారు. ‘వీఐపీ వస్తున్నారు.. జీజీహెచ్‌లో గుండె వైద్య నిపుణుడిని అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేస్తూ ముందుగానే కలెక్టర్‌ లేఖ రాశారు. ఆ లెటర్‌ రాయాల్సి వచ్చిందో విచారణలో తేలాల్సి ఉంది. నాటి సీఐడీచీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైనా ఎందుకు సస్పెండ్‌ చేయలేదో, ఆయనకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదు. నాపై హత్యాయత్నం కేసులో విచరణ సాఫీగానే జరుగుతుందని భావిస్తున్నా. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని రఘురామ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 03:48 AM