Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:57 PM
Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సితార గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

విజయవాడ, ఫిబ్రవరి 12: విజయవాడ నగరంలోని సితార గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఎగ్జిబిషన్లో వంట సామాగ్రిలో గ్యాస్ బండలు ఉండడంతో.. అవి సైతం పేలాయి. ఈ ప్రమాదంతో ఈ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదం ఘటనపై విజయవాడ వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావుకు ఫోన్ చేసి హో మంత్రి అనిత ఆరా తీశారు. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? అంటూ వివరాలు అడిగి ఆమె తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే మంటలు వ్యాపించాయని.. అయితే వాటిని అదుపులోకి తీసుకు వచ్చామని హోం మంత్రి అనితకు ఆయన వివరించారు.
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని.. దాంతో ఎగ్జిబిషన్లోని దుకాణాలు దగ్ధమైనాయని మంత్రి అనితకు ఏసీపీ దుర్గారావు తెలియజేశారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు.
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
ఇక ఇదే అగ్ని ప్రమాదంపై విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ జ్ఞాన్చంద్ మాట్లాడుతూ.. ఈ అగ్ని ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర పేలడమే కారణమన్నారు. ఈ ప్రమాదంలో రెండు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. భారీ ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. అయితే ఈ ఎగ్జిబిషన్కి పర్మిషన్ టైమ్ అయిపోయినప్పటికీ ఎందుకు ఉంచారనే అంశంపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
ఈ జనవరి 28వ తేదీతో ఈ ఎగ్జిబిషన్కి పర్మిషన్ అయిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇక్కడున్న పక్షులు, జంతువులను సురక్షిత ప్రాంతానికి తరలించామని మున్సిపల్ కమిషనర్ జ్ఞాన్చంద్ చెప్పారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.
For AndhraPradesh News And Telugu News