CS Shanti kumari: బాలికల వసతి గృహాలకు.. 29 మంది మహిళా ఐఏఎస్లు
ABN , Publish Date - Jan 10 , 2025 | 03:50 AM
తొలి దశలో 29 మంది మహిళా ఐఏఎ్సలు రాష్ట్రంలోని బాలికల హాస్టళ్లను సందర్శించి, రాత్రి బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

రాత్రిళ్లు బస చేయండి.. నివేదిక ఇవ్వండి
ఈ నెల 25 లోపు పరిశీలన పూర్తి చేయండి
సీఎస్ ఆదేశం.. వారి నివేదిక ఆధారంగా సమీక్ష
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తొలి దశలో 29 మంది మహిళా ఐఏఎ్సలు రాష్ట్రంలోని బాలికల హాస్టళ్లను సందర్శించి, రాత్రి బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బాలికల హాస్టళ్లను మహిళా ఐఏఎ్సలు పరిశీలించి తరువాత ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇదివరకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్శనలపై గురువారం సచివాలయం నుంచి సీఎస్ రాష్ట్రంలోని మహిళా ఐఏఎ్సలు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 540 బాలికల సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని సీఎస్ తెలిపారు. హాస్టళ్లకు ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పదార్థాలతో పాటు విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలిస్తారన్నారు. ఈ నెల 25వ తేది లోపు తొలిదశ పరిశీలన పూర్తి చేస్తారని, ఐఏఎ్సల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్పై సమీక్షిస్తామని తెలిపారు.