MLC Kavitha: కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు
ABN , Publish Date - Jan 31 , 2025 | 01:45 PM
MLC Kavitha: కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారిందని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు. ఎంతో మంది మేధావుల, ఇంజనీర్ల కృషి ఫలితమే అనేక ప్రాజెక్టుల నిర్మాణమన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లామని.. కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విర్మిస్తోందని మండిపడ్డారు.

హైదరాబాద్, జనవరి 31: నీళ్ళ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘‘నీళ్లు - నిజాలు’’పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందన్నారు. కేసీఆర్ (Former CM KCR) పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతజ్ఞతను ప్రదర్శించాలన్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ కొనసాగించారని.. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోందని గుర్తుచేశారు. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వారి ఫలితమే ప్రాజెక్టు నిర్మాణం..
సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని.. కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శత్రువులని ఆయన గమనించాలి. ఆంధ్ర కేడర్లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రైబ్యునల్లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి’’ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారిందని చెప్పుకొచ్చారు. ఎంతో మంది మేధావుల, ఇంజనీర్ల కృషి ఫలితమే అనేక ప్రాజెక్టుల నిర్మాణమన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లామని.. కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విర్మిస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారని.. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించామని వెల్లడించారు. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారన్నారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశామని ఎమ్మెల్సీ తెలిపారు.
Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే... ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యిందని విరుచుకుపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలను మోహరింపజేశారని.. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అంటూ విమర్శించారు. జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారని.. కానీ తెలంగాణ మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నీళ్లు ఇవ్వక రైతుల పొట్టకొడుతున్నారని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తి అయ్యిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
Osmania Hospital: ఉస్మానియా నూతన ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన
Read Latest Telangana News And Telugu News