Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్పై హరీష్ ఫైర్
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:19 PM
Harish Rao On Budget: తెలంగాణ బడ్జెట్కు సంబంధించి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. భట్టి ప్రవేశపెట్టింది గట్టి బడ్జెట్టా.. ఒట్టి బడ్జెట్టా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) కొనసాగుతున్నాయి. బడ్జెట్పై చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) మాట్లాడుతూ... శాసనసభకు బడ్జెట్ చాలా ముఖ్యమన్నారు. సభలో బడ్జెట్ ఆమోదం ముఖ్యమైన కార్యక్రమమని తెలిపారు. ప్రభుత్వానికి సహనశీలత, ఓపిక ఉండాలన్నారు. ప్రసంగం మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోకుండా చూడాలని కోరారు. సభలో ఏం మాట్లాడాలో చెబితే అదే మాట్లాడతామన్నారు. ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టింది ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా చెప్పాలన్నారు. గతేడాది బడ్జెట్ను సమీక్షించుకోవాల్సి ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారని.. ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని గుర్తుచేశారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ కోసం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.30వేల కోట్ల విలువైన భూములు అమ్మకానికి పెట్టారన్నారు. రుణమాఫీ రూ.31వేల కోట్లు సమీకరించుకున్నట్లు గత బడ్జెట్లో చెప్పారన్నారు. ఎన్నికల ముందు మార్కు పేరిట వాగ్దానాలు ఇచ్చారని.. ఎన్నికల తర్వాత వాగ్దానాలను ఏమార్చారని విమర్శించారు.
మాట తప్పిందెవరు
గతంలో ఫార్మా సిటీకి భూములు సేకరిస్తే కాంగ్రెస్ నిరసనలు చేసిందని.. కాంగ్రెస్ వచ్చాక ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామన్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక వెనక్కి ఇచ్చేది పోయి మళ్లీ లాక్కుంటామని చెబుతున్నారన్నారు. ఫార్మా సిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చి తిరిగి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. గతంలో నిర్ధరక ఆస్తులు అమ్మితే ఎలా విక్రయిస్తారన్నారని అన్నారు. రుణమాఫీలో విఫలమైనవారు..తమ చిత్తశుద్ధిని శంకిస్తున్నారని గతంలో భట్టి చెప్పారని.. అయితే ఇవాళ చేతగానివారెవరు, మాట తప్పిందెవరు.. చిత్తశుద్ధిలేని వారెవరో తేలిపోయిందని మాజీ మంత్రి వెల్లడించారు.
పెట్టుబడులు ఆగిపోయాయ్
ఈసారి బడ్జెట్లో కౌలు రైతుల ప్రస్తావనే లేదన్నారు. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టుకూలీ పెంచినట్లు చెప్పారని.. కుట్టుకూలీ రూ.50 నుంచి రూ.75కి పెంచినట్లు చెప్పారన్నారు. రూ.20 వేల కోట్లు మాత్రమే రుణమాపీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైందని ప్రశ్నించారు. గత బడ్జెట్లో పథకం కింద రైతుబంధు నిధులు ఇస్తామని చెప్పారని.. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పారని.. కౌలు రైతులను రైతులే చూసుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు చెప్పారన్నారు. కాంగ్రెస్ పాలనలో 4.5 లక్షల ఇళ్లు కాదు కదా.. 4 ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలు ఇళ్లు కట్టుకుంటే రూ.6 లక్షలు ఇస్తామని గొప్పగా చెప్పారని.. ఈసారి ప్రసంగంలో రూ.లక్ష మాయమైందని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజనులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో వాహనాల అమ్మకాలు జోరుగా జరిగాయన్నారు. తెలంగాణలో వాహనాల విక్రయాలు పడిపోయాయని తెలిపారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా అని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ అని సీఎం రేవంత్ గొప్పలు చెప్పారని.. సీఎం ప్రచారంతో తెలంగాణకు పెట్టుబడులు ఆగిపోయాయంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు.
తెలంగాణను నెంబర్ వన్గా నిలిపాం
గతంలో దివాళా తీసింది రాష్ట్రం కాదని.. తమరి ఆలోచనా విధానమన్నారు. కాంగ్రెస్ విధానాలు, పరిపాలనలో దివాళాతనం కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీయలేదని గమనించాలన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఆవిరయ్యాయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారని తెలిపారు. లక్షలోపు మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారన్నారు. ప్రధాన ప్రతిపక్షం సూచనలు తీసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. 2014లో రూ.62వేల కోట్ల నుంచి 2023 నాటికి రూ.2.31 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆదాయం 4 రెట్లు పెంచామని చెప్పుకొచ్చారు. ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణను నెంబర్వన్గా నిలిపామన్నారు. బీఆర్ఎస్ కృషితో తెలంగాణలో సాగు విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వ అసమర్థతతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితి అని అన్నారు. చేతి గుర్తు చేతకాని పాలనలో రైతు మళ్లీ అప్పు కోసం చేయి చాచాల్సి వస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రూ.49,500 కోట్లు కావాలని మాజీ మంత్రి అన్నారు.
అన్నింటిలో తగ్గుదలే
‘అందినకాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములు అమ్ముడు. ఇదే రేవంత్ మార్కు పాలన. తన పరిపాలన నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు తగ్గిపోతుంటే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి సీఎం ఈ మధ్య కొత్త వాదన షురూ చేసిండు. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నాడు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉందో మరి. అంతా నాకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం అహంకారం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడింది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయ్యిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం మనకే వచ్చిందా? మీ నెగిటివ్ పాలసీలు, మీ నెగిటివ్ పాలిటిక్స్ మూలంగా ఆదాయం కుంటుపడింది. రేవంత్ పాదం మోపిన వేళా విశేషం ఏమో గానీ, ఆర్థిక వృద్ధి నేల చూపులు చూస్తున్నది. జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల. దీనికి కారణం ఆర్థిక మాంద్యమా. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం మన ఒక్క రాష్ట్రానికే ఉన్నదా. ఈ తగ్గుదలకు కారణం ఆర్థిక మాంద్యం కాదు అధ్యక్షా.. ప్రభుత్వ మాంద్యం, ప్రభుత్వ వైఫల్యం. నేను చాలా బాధగా చెబుతున్నాను. ముఖ్యమంత్రి ఇస్తున్న నినాదం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు, ఐ యాం ఆస్కింగ్ వేర్ ఈజ్ ఇట్ రైజింగ్. జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్.. వెహికిల్ సేల్స్ డౌన్’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Hyderabad: ఇందిరాపార్కులో టాయ్ ట్రైన్..
Read Latest Telangana News And Telugu News