Share News

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

ABN , Publish Date - May 07 , 2024 | 02:22 PM

తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టును రంగంలోకి దించేందుకు సీనియర్లను పేర్ని పక్కనపెట్టారు. కిట్టును ఎలాగైనా గెలిపించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు ..

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

  • ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్నింటా అవినీతి

  • బినామీల పేరిట అక్రమ ఆదాయం రూ.కోట్లలోనే..

  • జగనన్న కాలనీ స్థలాల్లో భారీగా కమీషన్లు

  • సముద్ర తీర భూములు కబ్జా చేసి అక్రమార్జన

  • మడ అడవులను మింగేసి.. చేపల చెరువులుగా మార్చేసి..

  • ఐటీ రిటర్న్స్‌ సాక్షిగా పది రెట్లు పెరిగిన ఆదాయం

  • తనయుడి గెలుపు కోసం సీనియర్లకు చెక్‌

  • ఎన్నికల ముందు నకిలీ పట్టాల పంపిణీ వివాదం

  • ఐదేళ్లలో మచిలీపట్నంలో పేర్ని నాని దోపిడీపర్వం

  • కాలనీల్లో కమీషన్లు

పేదల ఇళ్ల స్థలాల్లో పైసలేరుకున్నారు.. ఓట్లు రాబట్టుకునేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారు.. వలంటీర్లను అస్త్రంగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందారు.. అసైన్డ్‌ భూముల పేరుచెప్పి బడాబాబుల నుంచి భారీగా వసూలు చేశారు.. సముద్ర తీరప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని కబ్జాలకు తెరలేపారు.. అవసరమైన చోట చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు.. మడ అడవులను నాశనం చేసేశారు.. ఐదేళ్లలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని (MLA Perni Nani) సాధించిన ఘనకార్యాలివి. ఎమ్మెల్యేగా ఐదేళ్లు, మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేసినా నియోజకవర్గంలో వీసమెత్తు అభివృద్ధి చేసింది లేదు. తెరపై తనంత మంచోడు లేడన్నట్టు నటిస్తూ.. తెరవెనుక అనుచరులతో అన్ని అవినీతి పనులు చేయిస్తూ పాలనలో పేర్ని నాని తనదైన మార్క్‌ చూపించారు. - మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి.


Perni-Nani-Final.jpg

జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాల సంగతి దేవుడెరుగు వైసీపీ ప్రజాప్రతినిధులకు మాత్రం కాసుల పంట పండింది. మచిలీపట్నం నియోజ కవర్గంలోని కరగ్రహారం సమీపంలో సుమారు 350 ఎకరాలను జగనన్న ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఎకరం భూమిని రూ.39 లక్షలకు కొన్నారు. ఈ భూముల కొనుగోలులో వారసత్వంగా వచ్చిన వారికి.. భూమికి సంబంధించిన పత్రాలు సక్రమంగా లేనివారికి.. వివాదాల్లో ఉన్న భూములకు.. రికార్డులు తారుమారు చేసి ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ పేర్ని అనుచరులు కమీషన్‌ తీసుకున్నారు. భూముల అసలు విలువ కంటే ఎక్కువ ధరకు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా రూ.30 లక్షలు అంటే చాలా ఎక్కువ. అలాంటి భూమిని కమీషన్ల కోసం ఎక్కువ ధర చూపి ప్రజాధనాన్ని దోచేశారు. పేర్ని అనుచరులు ఎకరాకు రూ.5 లక్షల వరకు కమీషన్‌ దోచేశారు. సుమారు రూ.20 కోట్ల వరకూ ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

నకిలీ పట్టాల పంపిణీ

తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టును రంగంలోకి దించేందుకు సీనియర్లను పేర్ని పక్కనపెట్టారు. కిట్టును ఎలాగైనా గెలిపించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు ఇళ్ల పట్టాలను ఓ మార్గంగా ఎంచుకున్నారు. వైసీపీలో చేరిన వారికి పట్టా ఇచ్చేలా మాట్లాడుకుని సుమారు 16 వేల మందికి నకిలీ పట్టాలు పంపిణీ చేయాలనుకున్నారు. రెవెన్యూ అధికారులూ సహకరించారు. చివరికి కలెక్టర్‌పై వేటు పడటంతో ఈ నకిలీ పట్టాల తంతుకు బ్రేక్‌ పడింది. అలాగే, తన స్వార్థ రాజకీయాల కోసం వలంటీర్ల జీవితాలతోనూ పేర్ని నాని ఆడుకున్నారు. మచిలీపట్నంలో వలంటీర్లతో భారీ ఎత్తున రాజీనామాలు చేయించారు. రాజీనామా చేసిన వలంటీర్లంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని, వృద్ధులను ఆటోలు పెట్టి దగ్గరుండి తీసుకెళ్లాలంటూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.


Perni-Nani-And-Kittu.jpg

ఆదాయం అంతకంతకూ..

గత ఎన్నికల సమయలో పేర్ని నాని దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో 2017-18 సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపిన ఆదాయం రూ.4.80 లక్షలు. 2019 తర్వాత ఆయన ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. 2020-21లో ఆయన చూపిన ఆదాయం రూ.49.07 లక్షలు, అదే ఏడాది ఆయన భార్య పేరిట వేసిన రిటర్న్స్‌లో చూపిన ఆదాయం రూ.10.87 లక్షలు, 2021-22లోనూ ఆయన ఆదాయం రూ.30.94 లక్షలు, ఆయన భార్య ఆదాయం రూ.12.07 లక్షలు. ఆస్తులు కూడా పెరిగాయి. బినామీల పేరుతో ఆయన సంపాదించిన ఆదాయానికి లెక్కేలేదు.

నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి

ఖాళీగా కనిపిస్తే చాలు అధికార పార్టీ నాయకులు ఆక్రమించేశారు. ఈ ఆక్రమణలను యథేచ్ఛగా కొనసాగించారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుని మరీ ఈ అక్రమాలకు తెరతీశారు. ఎదురుచెప్పిన వారిపై సామదానదండోపాయాలు ప్రయోగించి తమ దారిలోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరుల కనుసన్నల్లో ఈ భూదందా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది.

బందరు మండలం పల్లెతుమ్మలపాలెం గ్రామం సమీపంలో 70 ఎకరాల ప్రభుత్వ భూమి వందేళ్లకు పైబడి ఖాళీగానే ఉంటోంది. సముద్రానికి సమీపంలో ఉన్న ఈ భూమిలోకి ఆటుపోట్లు వచ్చి పోతుంటాయి. వైసీపీ అధికారం చేపట్టాక ఈ భూమిపై వైసీపీ నాయకుల కన్నుపడింది. అనుకున్నదే తడవుగా ఈ భూమిని రొయ్యల చెరువులుగా తవ్వడం ప్రారంభిం చారు. గ్రామస్థులు అడ్డు చెప్పడంతో గ్రామంలోని వైసీపీ కార్యకర్తలను తెరపైకి తెచ్చి 50 ఏళ్ల క్రితమే తమకు పట్టాలు ఇచ్చారని చెప్పించారు. తప్పుడు పత్రాలు చూపించారు. రెవెన్యూ అధికారులు, ఆర్డీవో విచారణలో ఇది నిర్ధారణ కూడా అయ్యింది. ఇంతా జరిగినా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామంలోని కొందరి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమిని రొయ్యల చెరువులుగా తవ్వేశారు. వేరే వ్యక్తులకు లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భూములు వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి.


YS-Jagan-and-Perni-Kitti.jpg

కబ్జాసుర..!

మచిలీపట్నం డంపింగ్‌ యార్డుకు భూమి కొనాలని వైసీపీ నాయకులు మచిలీపట్నం ప్రాంతంలో చేపల చెరువులు సాగుచేస్తున్న భీమవరం రాజుల నుంచి పెద్దమొత్తంలో నగదు వసూలు చేశారు. భూమి లభ్యంగా లేదని, భీమవరం రాజులు సాగుచేసే చేపల చెరువులోని 20 ఎకరాలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కోనరోడ్డు వెంబడి, ఆటోమేటిక్‌ కాల్వ సమీపంలో 14 ఎకరాలను ఇచ్చేందుకు భీమవరం బడాబాబులు అంగీకరించారు. కానీ, ఆ భూమి డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు సరిపోదని, నగదు రూపంలో ఇవ్వాలని ఇద్దరు, ముగ్గురు వైసీపీ కార్యకర్తల ద్వారా తెరవెనుక రాయబారాలు నడిపారు. బలవంతంగా నగదు వసూలు చేశారని భీమవరం రాజులు చెప్పకనే చెప్పారు. ఈ నగదు ఇవ్వకుంటే చేపల చెరువుల రూపంలో ఉన్న అసైన్డ్‌ భూములకు సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు గురిచేశారు. డంపింగ్‌ యార్డు కోసం వసూలు చేసిన నగదు ఎవరికి చేరిందనేది అందరికీ తెలిసిన రహస్యమే.

  • కరగ్రహారం-గిలకలదిండి వెళ్లే దారిలో గోదాముల సమీపంలో సర్వే నెంబరు 248లో 118 ఎకరాల మడ అడవులను ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరుడొకరు ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశం పత్రికల్లో రావడంతో రెవెన్యూ అధికారులు ఆ పనులను నిలిపివేశారు. కొద్దికాలం పాటు మిన్నకుండిపోయి, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని, రాత్రికి రాత్రే ఈ చెరువులను తవ్వి భీమవరం రాజులకు లీజుకు ఇచ్చారు.

  • కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గర్లో ఉన్న కొత్తపల్లెతుమ్మలపాలెం గ్రామ పరిధిలో కరకట్ట వెంబడి మడ అడవులున్నాయి. ఇక్కడ వివాదంలో ఉన్న 15 ఎకరాలను, వాటి పక్కనే ఉన్న మరో 30 ఎకరాల మడ అడవులను ఎమ్మెల్యే షాడో ఆక్రమించేశారు. ఈ భూములను రొయ్యల చెరువులుగా మార్చేశారు. కృష్ణానదికి సమీపంలో ఉన్న ఈ భూములు రొయ్యల చెరువుల సాగుకు అనుకూలంగా ఉండటంతో ఎకరాకు ఏడాదికి రూ.50 వేల చొప్పున లీజుకు ఇచ్చారు. ఈ వ్యవహారంపై గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. మచిలీపట్నం ఆర్డీవో, తహసీల్దార్‌లు స్వయంగా వెళ్లి ఈ భూములను పరిశీలించారు. రెండేళ్ల క్రితం అధికారులు ఇచ్చిన నివే దిక బయటకు రాకుండా వైసీపీ నాయకులు తొక్కిపెట్టేశారు. ఇప్పటికీ ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు లేవు.

  • మచిలీపట్నం కరగ్రహారానికి చెందిన శొంఠి ఫరీద్‌ అనే అనుచరుడిని అడ్డుపెట్టుకుని గ్రామంలో 100 ఎకరాలకు పైగా మడ అడవిని తవ్వి చెరువులుగా చేసేశారు. ఇవి ప్రభుత్వ భూములైనా.. పేదలను అడ్డుపెట్టి, వారే చెరువులుగా మారుస్తున్నారని చూపి కబ్జా చేశారు.

  • ఈ ఐదేళ్లలో మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పేర్ని అనుమతి లేకుండా ఒక్క అభివృద్ధి పని కూడా జరగకూడదని అనధికార ఆదేశాలు అమలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రూ.15 కోట్లతో సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రి సూచించిన వారికే కాంట్రాక్టులు ఇచ్చారు. ఉల్లింగపాలెం, సర్కిల్‌పేట తదితర ప్రాంతాల్లో గతంలో వేసిన సిమెంట్‌ రోడ్లపైనే మళ్లీ సిమెంట్‌ రోడ్లు వేశారు.

  • పేర్ని అనుచరుల దందాలతో మచిలీపట్నంలోని వ్యాపారవేత్తలు బెంబేలెత్తిపోయారు. నియోజకవర్గంలో ఉన్న ఉప్పు పరిశ్రమకు గతంలో పలువురు లారీలను అద్దెకు తిప్పుకుంటుండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చి.. పేర్నికి మంత్రి పదవి దక్కగానే ఆయన అనుచరులు చెలరేగిపోయారు. లారీ యజమానులను బెదిరించి పంపేశారు. తమ లారీలే, తాము చెప్పిన ధరకే తిరిగేలా పరిశ్రమ పెద్దలను బెదిరించి ఒప్పించారు.

  • మచిలీపట్నానికి చెందిన దళిత మహిళ పద్మజను 2020, సెప్టెంబరులో పేర్ని నాని సన్నిహితుడి అనుచరులు కిడ్నాప్‌ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో వైసీపీకి చెందిన కొందరు బడాబాబుల హస్తం ఉండటంతో అప్పట్లో మంత్రిగా ఉన్న పేర్ని నాని ఒత్తిడితో విచారణను పక్కదారి పట్టించి సూత్రధారులను తప్పించేశారు. దళిత మహిళ పట్ల పేర్ని నాని వ్యవహరించిన తీరు ఇది.

  • పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావును 2020, జూన్‌లో హత్య చేశారు. ఈ హత్యను కూడా పేర్ని నాని రాజకీయంగా వాడుకుని దాన్ని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రపై మోపి ఆయన్ను జైలుపాలు చేశారు. రాజకీయంగా లబ్ధి పొందారు.

Updated Date - May 07 , 2024 | 02:26 PM