Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

ABN , First Publish Date - 2023-08-10T15:25:10+05:30 IST

ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన వీడియో బయటపడినప్పటి నుంచి.. మణిపూర్‌లో జరిగిన మరెన్నో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాము న్యాయం చేస్తామని అధికారులు ధైర్యం నూరిపోరవడంతో..

Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన వీడియో బయటపడిన నాటి నుంచి ఒక్కొక్కటిగా మరిన్ని దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తాము న్యాయం చేస్తామని అధికారులు ధైర్యం ఇస్తుండడంతో సహాయక శిబిరాల్లో ఉంటున్న మహిళలు ముందుకొచ్చి తమపై జరిగిన అఘాయిత్యాల గురించి నోరు విప్పుతున్నారు. తాజాగా మరో మహిళ వెల్లడించిన తన దీనగాధ కలచివేస్తోంది. అల్లర్లు చెలరేగిన రోజు తనపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆరుగురు వ్యక్తులు తనని కిరాతకంగా కొట్టి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారని సదరు మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. 37 ఏళ్ల మహిళకు ఈ దారుణ పరిస్థితి ఎదురైంది.


‘‘మే 3వ తేదీన మణిపూర్‌లో అల్లర్లు చెలరేగినప్పుడు, కొందరు దుండగులు మా ఇంటిని తగలబెట్టేశారు. అప్పుడు నేను నా ఇద్దరు కుమారుల్ని, మేనకోడల్ని వీపుపై ఎత్తుకొని.. వదినతో కలిసి ఇళ్లు వదిలి పారిపోతున్నాం. మా వదిన కూడా తన వీపుపై ఒక బిడ్డను ఎత్తుకుంది. కొంత దూరం పరిగెత్తిన తర్వాత నేను బాగా అలసిపోయి కుప్పకూలిపోయాను. అప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్లిపోమ్మని చెప్పగా.. వదిన వారిని తీసుకొని వెళ్లింది. నేను ఎలాగోలా పైకి లేచి పారిపోతుండగా.. ఐదారుగురు దుండగులు నన్ను పట్టుకున్నారు. వాళ్లు నన్ను దూషించడంతో పాటు నాపై దాడి చేశారు. నేను ప్రతిఘటించగా.. వాళ్లు నన్ను బలంగా కొట్టి, రోడ్డుపై పడేశారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు’’ అని ఆ మహిళ తన జీరో ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

ఆ దుండగులు రాబందుల్లా తనపై ఎగబడటంతో తన ఆరోగ్యం దెబ్బతిందని, మానసికంగానూ కుంగిపోయానని, దాంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని బాధిత మహిళ రోధించింది. అయితే.. తాను ధైర్యాన్ని కూడగట్టుకొని, ఇంఫాల్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లానని.. కానీ తన పరిస్థితిని ఎలా వివరించాలో తెలియక వెనక్కు తిరిగి వచ్చేశానని చెప్పింది. కొన్ని రోజుల్లోనే తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేరానని.. అక్కడి వైద్యులు తనకు ట్రీట్మెంట్ ఇచ్చి, తనలో ధైర్యం నింపారని తెలిపింది. తన తప్పేమీ లేకున్నా, తనపై ఆ దుండుగులు చేసిన క్రూరమైన పనికి తానెంతో బాధపడ్డానని భావోద్వేగానికి గురైంది. తనను లైంగికంగా వేధించిన ఆ దుర్మార్గులకు తగిన శిక్ష విధించాలని ఆమె కోరింది. చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 376డి, 354, 120బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-08-10T15:59:17+05:30 IST