Share News

Assembly elections: ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని స్థానాలకంటే..?

ABN , First Publish Date - 2023-11-07T08:12:00+05:30 IST

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఓటర్లు నేడు ఓటు వేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ మొదలైంది.

Assembly elections: ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని స్థానాలకంటే..?

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఓటర్లు నేడు ఓటు వేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ మొదలైంది. 90 అసెంబ్లీ స్థానాలు గల ఛత్తీస్‌గఢ్‌లో నేడు 20 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 12 ఎస్టీ స్థానాలు, ఒక ఎస్సీ స్థానం ఉన్నాయి. ఇందులో 10 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ఎస్టీ స్థానాలైన మొహలా-మాన్‌పూర్‌, అంతగఢ్‌, భానుప్రతాప్‌పూర్‌, కాంకేర్‌, కేశ్‌కాల్‌, కొండగావ్‌, నారాయణపూర్‌, దంతేవాడ, బీజాపూర్‌, కోంటా సీట్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వీటిలో ఖైరాఘర్, డొంగర్‌ఘర్, రాజ్‌నంద్‌గావ్, డొంగర్‌గావ్, ఖుజ్జీ, పండరియా, కవర్ధా బస్తర్, జగదల్‌పూర్, చిత్రకోట్‌ నియోజకవర్గాలున్నాయి.


బస్తర్‌ డివిజన్‌లోని 12 స్థానాల్లో పోలింగ్‌ సజావుగా జరగడం కోసం 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అందులో 40 వేల మంది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)కి చెందినవారు. 20 వేల మంది రాష్ట్ర పోలీసులున్నారు. బస్తర్ డివిజన్, మావోయిస్ట్ ప్రభావిత మొహ్లా-మన్‌పూర్‌లో భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఎలైట్ యాంటీ నక్సల్ యూనిట్ కోబ్రా, డ్రోన్‌లు, హెలికాప్టర్లు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 25,249 మంది పోలింగ్‌ సిబ్బంది ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు తొలి దశ బరిలో నిలిచారు. 40,78,681 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. బరిలో నిలిచిన ప్రముఖుల్లో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం రమణ్‌సింగ్‌ (రాజ్‌నంద్‌గావ్‌), పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ దీపక్‌ బైజ్‌ (చిత్రకూట్‌) తదితరులున్నారు. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్‌ జరుగుతుంది.

40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, అప్పటికే క్యూలైన్‌‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు ఒకే దశలో పోలింగ్ పూర్తి చేయనున్నారు. ఇక్కడ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జడ్‌పీఎం), కాంగ్రెస్‌ నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. 18 మంది మహిళలు సహా 174 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 8,51,895 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1,276 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మయన్మార్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేశారు. అసోం, మణిపూర్‌, త్రిపుర రాష్ట్ర సరిహద్దులను బంద్‌ చేశారు. కాగా గత ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌కు 27 స్థానాలు, జడ్‌పీఎంకు 7, కాంగ్రె్‌సకు 5, బీజేపీకి ఒక్క స్థానం దక్కాయి. కాగా ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి.

Updated Date - 2023-11-07T08:12:07+05:30 IST