West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కూడా మణిపూర్ తరహాలో మహిళల నగ్న ఊరేగింపు.. వీడియో వైరల్..

ABN , First Publish Date - 2023-07-22T13:51:07+05:30 IST

మహిళలను అవమానించే సంఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్‌లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్‌లో అటువంటి దుశ్చర్య బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొందరు మహిళా వ్యాపారులు కొట్టినట్లు తెలుస్తోంది.

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కూడా మణిపూర్ తరహాలో మహిళల నగ్న ఊరేగింపు.. వీడియో వైరల్..

కోల్‌కతా : మహిళలను అవమానించే సంఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్‌లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్‌లో అటువంటి దుశ్చర్య బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొందరు మహిళా వ్యాపారులు కొట్టినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య వాగ్యుద్ధం మరింత ముదిరింది.

మణిపూర్‌లో దారుణం

మే 3 నుంచి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ రాష్ట్రంలో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది అత్యంత అమానుషమైన సంఘటన అని, ఇది దేశానికి అవమానకరమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు. మణిపూర్‌లోని కంగ్పోక్పి జిల్లాలో మే 4న జరిగిన ఈ అమానుష దాడిపై సుప్రీంకోర్టు కూడా స్వీయ విచారణ జరుపుతోంది. జాతీయ మహిళా కమిషన్ గతంలోనే స్పందించినప్పటికీ, మణిపూర్ పోలీసులు సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ దారుణంపై కాంగ్రెస్, టీఎంసీ, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇటువంటి సమయంలో టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొట్టినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అవడంతో మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడుతోంది.

దొంగతనం నెపంతో..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో మూడు, నాలుగు రోజుల క్రితం స్థానిక మహిళా వ్యాపారులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిద్దరూ దొంగతనం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారి శరీరం పైభాగంలోని వస్త్రాలను తొలగించి, కొట్టారు. అయితే అటు వ్యాపారులు కానీ, ఇటు బాధిత మహిళలు కానీ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ వీడియో తమ దృష్టిలో పడిన తర్వాత మాత్రమే ఈ సంఘటన గురించి తమకు తెలిసిందని పోలీసులు చెప్తున్నారు. బాధితులు పారిపోగా, వారిని పట్టుకున్నవారు కూడా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. ఈ సంఘటన ఇటీవలే పకుహట్ ప్రాంతంలో జరిగినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, తగిన చర్య తీసుకుంటామని చెప్పారు.

భయోత్పాతం కొనసాగుతోంది : బీజేపీ

పశ్చిమ బెంగాల్‌లో భయోత్పాతం కొనసాగుతోందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. మాల్డాలోని బమన్గోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, నిర్దయగా హింసించి, కొట్టారని ఆరోపించారు. పోలీసులు మౌన ప్రేక్షకులుగా మారిపోయారన్నారు. పకువా హట్ ఏరియాలో జూలై 19న ఈ దారుణం జరిగినట్లు తెలిపారు.

బాధిత మహిళలు సాంఘికంగా అణగారిన వర్గాలకు చెందినవారని, పిచ్చిపట్టిన మూక ఆ మహిళల రక్తం తాగడం కోసం వెర్రిగా తహతహలాడిందని మండిపడ్డారు. ఈ విషాదకర సంఘటన ముఖ్యమంత్రి మమత బెనర్జీ హృదయాన్ని పగులగొట్టి ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు. ఆమె రాష్ట్రానికి హోం మంత్రి కూడా కాబట్టి కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా, చర్య తీసుకుని ఉండాలన్నారు. కానీ ఏమీ చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నారని దుయ్యబట్టారు. ఈ ఆటవికతను ఆమె ఖండించలేదని, బాధ, ఆవేదనలను వ్యక్తం చేయలేదని, అలా చేస్తే తాను ముఖ్యమంత్రిగా విఫలమైనట్లు బయటపడిపోతుందని భావించారని ఎద్దేవా చేశారు. కానీ ఓ రోజు తర్వాత ఆమె భోరున విలపించారని, కన్నీళ్లు కార్చారని, రాజకీయంగా అవసరం కాబట్టి అలా చేశారని అన్నారు.

ఇవి కూడా చదవండి :

HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Updated Date - 2023-07-22T13:51:07+05:30 IST