Manipur : మణిపూర్ సంక్షోభం.. బీజేపీపై చిదంబరం ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-07-23T15:21:52+05:30 IST

మణిపూర్‌లో పరిస్థితిని బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చుతున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (P Chidambaram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా విధించుకున్న కోమాలో ఉందని దుయ్యబట్టారు.

Manipur : మణిపూర్ సంక్షోభం.. బీజేపీపై చిదంబరం ఆగ్రహం..

న్యూఢిల్లీ : మణిపూర్‌లో పరిస్థితిని బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చుతున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (P Chidambaram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా విధించుకున్న కోమాలో ఉందని దుయ్యబట్టారు. మణిపూర్‌పై చర్చను తప్పించుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అత్యాచారాల గురించి బీజేపీ లేవనెత్తుతోంది. ప్రతిపక్షాలు వీటిపై ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నిస్తోంది. మెయిటీ తెగవారికి షెడ్యూల్డు తెగల హోదా కల్పించాలనే డిమాండ్‌ను పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో మణిపూర్‌లో మే 3 నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో పీ చిదంబరం ఇచ్చిన ట్వీట్‌లో, బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మహిళలపై హింసాత్మక సంఘటనలు జరిగాయని అంగీకరిద్దామన్నారు. మణిపూర్‌లో నిరంతరం కొనసాగుతున్న హింసాత్మక ఘర్షణలను ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నదానిని ఏ విధంగా పోల్చి చూపుతారని ప్రశ్నించారు.

‘‘మణిపూర్‌లోని లోయలో కుకీలు మిగిలారా? చురాచాంద్‌పూర్‌, తదితర జిల్లాల్లో మెయిటీలు మిగిలారా? వస్తున్న వార్తల్లో నిజం ఉంటే, మణిపూర్‌ నుంచి తరిమేయడం జరిగిపోయింది’’ అని చెప్పారు. నిష్పాక్షికంగా మదింపు చేసినపుడు, మణిపూర్‌లో రాజ్యాంగ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల అధికారం వారి ఇళ్లను దాటి అమలు కావడం లేదన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని, పశ్చిమ బెంగాల్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పరిస్థితులతో ఏ విధంగా పోల్చి చూపుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థురాలు మాత్రమే కాదని, పక్షపాతంతో కూడినదని దుయ్యబట్టారు. రోత పుట్టించే పోలికలను చూపిస్తూ, దాక్కోవడం చాలా క్రూరమని మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కఠిన చర్యలు అవసరమైతే అందుకు తగిన ఆదేశాలను ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు. కానీ మణిపూర్‌లో జరుగుతున్న ఆటవికతకు దీనిని సాకుగా చూపించకూడదని దుయ్యబట్టారు.

మణిపూర్‌లో ఎందుకీ దుస్థితి?

మెయిటీ తెగవారికి షెడ్యూల్డు తెగల హోదాను ఇవ్వడంపై పరిశీలించాలని ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో మే 3 నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి. కుకీ, మెయిటీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

Updated Date - 2023-07-23T15:21:52+05:30 IST