IND vs PAK: రిజర్వ్ డే రోజైనా మ్యాచ్ సజావుగా సాగేనా.. కొలంబోలో నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

ABN , First Publish Date - 2023-09-11T09:18:35+05:30 IST

ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

IND vs PAK: రిజర్వ్ డే రోజైనా మ్యాచ్ సజావుగా సాగేనా.. కొలంబోలో నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

కొలంబో: ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడుతుండగా ఈ సారి కూడా వర్షం కంగారుపెడుతోంది. ఇప్పటికే వర్షం కారణంగా ఆదివారం రోజే పూర్తవాల్సిన మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. ముందస్తు హెచ్చరికలతో మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయించారు. కానీ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సజావుగా సాగుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే స్థానిక వాతావరణ నివేదికల ప్రకారం.. మ్యాచ్ జరిగే కొలంబోలో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. 85% వర్షం పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభమయ్యే మధ్యాహ్నం 3 గంటల సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. సాయంత్రం 5 గంటల సమయంలో 80 శాతం, 5 గంటల 30 నిమిషాల సమయంలో 82 శాతం, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల సమయంలో 72 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కూడా వర్షం కొనసాగొచ్చు.


ఇదే జరిగితే నేడు కూడా మ్యాచ్ జరగకపోవచ్చు. అప్పుడు మ్యాచ్‌ను రద్దు చేయాల్సిందే. అప్పుడు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అదే జరిగితే రిజర్వ్ డే రోజు కూడా రద్దైన మ్యాచ్‌గా ఇది నిలిచిపోనుంది. ఒక వేళ వరుణుడు కాస్త శాంతిస్తే ఓవర్లు కుదించి మ్యాచ్‌ను కొనసాగించనున్నారు. మొత్తంగా పూర్తి ఓవర్ల ఆట సాధ్యపడడం కష్టంగానే కనిపిస్తోంది. కానీ అభిమానులు మాత్రం వర్షం అడ్డుపడకూడదని, పూర్తి ఓవర్ల ఆట సాగాలని కోరుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు వాతావరణ నివేదికలకు వ్యతిరేకంగా జరుగుతుంటుంది. వర్షం వస్తుందని అంచనా వేస్తే రాదు. ప్రస్తుతం కొలంబోలో అదే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా దాయాదుల పోరుకు ప్రతిసారి వరుణుడు అడ్డుకుంటుండడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

WhatsApp Image 2023-09-10 at 17.11.58.jpeg

ఇక ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్ (17) ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ధాటిగా ఆడిన వీరిద్దరు మొదటి వికెట్‌కు 13.2 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడాడు. మరోవైపు గిల్ మాత్రం ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో గిల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గిల్‌కు ఇది 8వ హాఫ్ సెంచరీ కాగా.. రోహిత్ శర్మకు 50వ హాఫ్ సెంచరీ.

WhatsApp Image 2023-09-10 at 14.21.32.jpeg

అయితే వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్‌లో పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. ఫహీమ్ అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 121 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. ఆ కాసేపటికే షామీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు. 52 బంతులు ఎదుర్కొన్న గిల్ 10 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. దీంతో 123 పరుగులకు టీమిండియా ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. ఇక జట్టు స్కోర్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల వద్ద ఉండగా.. వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు సార్లు ఆగినప్పటికీ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఓవర్లు కుదించి మ్యాచ్ కొనసాగించడానికి ప్రయత్నించారు. కానీ 8 గంటల 35 నిమిషాలకు వర్షం మళ్లీ ప్రారంభవడంతో చేసేదేమి లేక సోమవారానికి వాయిదా వేశారు.

Updated Date - 2023-09-11T09:23:33+05:30 IST