IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఖాతాలోకి రెండు రికార్డులు

ABN , First Publish Date - 2023-07-15T11:52:12+05:30 IST

మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల (India won by an innings and 141 runs) భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఆసియా వెలుపల టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం.

IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఖాతాలోకి రెండు రికార్డులు

డొమినికా: మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల (India won by an innings and 141 runs) భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఆసియా వెలుపల టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం. ఈ విజయంతో 2016లో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును టీమిండియా అధిగమించింది. అలాగే టెస్ట్ క్రికెట్‌లో వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది 23వ విజయం. దీంతో భారత జట్టు ఒక ప్రత్యర్థిపై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో వెస్టిండీస్ మూడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో గతంలో న్యూజిలాండ్‌పై (new zealand) ఉన్న 22 విజయాల రికార్డును వెస్టిండీస్‌పై విజయంతో భారత జట్టు అధిగమించింది. భారత జట్టు అత్యధికంగా ఆస్ట్రేలియాపై(Australia) 32 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచింది. కాగా 2002 తర్వాత వెస్టిండీస్‌తో భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడకపోవడం గమనార్హం.


ఇక మూడు రోజుల్లోనే ముగిసిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ములేపిన రోహిత్ సేన ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముఖ్యంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను(Ravichandran Ashwin) ఎదుర్కొలేక విండీస్ బ్యాటర్లు పెవలియన్‌కు క్యూ కట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 7 వికెట్లతో విండీస్ నడ్డి విరిచాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌ మొత్తంలో 12 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. 271 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కనీస పోరాటపటిమను కూడా చూపలేకపోయింది. టీమిండియా స్పిన్నర్ల ధాటికి వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ కంటే దారుణంగా రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కరేబియన్ జట్టు కుప్పకూలింది. 28 పరుగులు చేసిన అలిక్ అథానాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లోనూ 47 పరుగులతో అథానాజే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ 7, జడేజా 2(Ravindra Jadeja), సిరాజ్(Mohammed Siraj) ఒక వికెట్ తీశారు. కాగా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. విండీస్ పతనాన్ని శాసించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిసి జడేజా కూడా 5 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్, జడేజానే 17 వికెట్లు తీయడం గమనార్హం.

అంతకుముందు భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను 421-5 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 171 పరుగులతో దుమ్ములేపాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) (103) కూడా సెంచరీ కొట్టగా.. విరాట్ కోహ్లీ ( Virat Kohli) 76 పరుగులతో రాణించాడు. జడేజా(37), ఇషాన్ కిషన్(1) నాటౌట్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో రోచ్, అల్జారీ జోసెఫ్, కార్న్‌వాల్, అలిక్ అథానాజ్, వారికన్ తలో వికెట్ తీశారు. అరంగేట్రంలోనే 171 పరుగులతో దుమ్ములేపిన యశసస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(PLAYER OF THE MATCH) దక్కింది. కాగా ఈ విజయంతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.

Updated Date - 2023-07-15T11:54:39+05:30 IST