TS News: ఓవైపు ఊరూరా చెరువు పండుగ.. మరోవైపు గంగపుత్ర సంఘం నిరసన

ABN , First Publish Date - 2023-06-09T14:12:46+05:30 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఊరూరా చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరాన ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక కార్యక్రమాలు జరిపి గంగపుత్రులు ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చారు.

TS News: ఓవైపు ఊరూరా చెరువు పండుగ.. మరోవైపు గంగపుత్ర సంఘం నిరసన

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఊరూరా చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరాన ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక కార్యక్రమాలు జరిపి గంగపుత్రులు ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చారు. గంగపుత్రుల ఉనికిని ప్రభుత్వం ప్రశ్నార్ధకంగా మారుస్తూ విడుదల చేసిన అక్రమ జీఈవోలను వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ గంగ తెప్పోత్సవం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఊరూరా చెరువు సంబరాల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) పాల్గొన్నారు.

గంగ తెప్పోత్సవ కమిటీ సంబరాలు..

ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరూరా చెరువు సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గంగమ్మ తల్లికి చీర, సారె సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, తెప్పోత్సవ కమిటీ చైర్మన్‌ ఎం మహేందర్‌ బాబు, నేతలు మంగలంపల్లి రాజు, మల్కు అరుణ్‌జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ గంగపుత్ర సంఘం నిరసన..

ఊరూరా చెరువు కార్యక్రమం జరుగుతుండగా... తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్రసంఘం, నగర గంగపుత్ర సంఘం, స్థానిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకొని గంగమ్మకు వేరుగా పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులను అన్యాయానికి గురిచేస్తూ విడుదల చేసిన జీవోలు 06, 04, 268, 45 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో తమకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరగా అందుకు ఆయన హామీ ఇచ్చారు. గంగపుత్రుల కులవృత్తిని పండ్లు, ఫలాలు అమ్మే ముదిరాజ్‌ కులానికి దారాధత్తం చేస్తూ తెచ్చిన జీవోలకు తాము వ్యతిరేకమని, ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులు పోరాటం చేస్తారని తెలియజేశారు.

తెలంగాణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గడప శ్రీహరి, ప్రధాన కార్యదర్శి శరణార్థి చంద్ర ప్రకాష్‌లు మట్లాడుతూ.. గంగపుత్ర సొసైటీలలో ఇతరులకు సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వేసిన సమన్వయ కమిటీలను వెంటనే రద్దు చేయాలని కోరారు. సాంప్రదాయ మత్స్యకారులు బెస్త గుండ్ల గంగపుత్రులేనని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. గంగ తెప్పోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. ఇందులో హైదరాబాద్‌ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు చాట్ల సదానంద్‌, ప్రధాన కార్యదర్శి పిల్లి శంకర్‌, స్థానిక కమిటీల అధ్యక్షులు గాండ్ల అశోక్‌, మదనాల బాబూరావు, అంబటి సుధాకర్‌, ఆకుల మోహన్‌దాస్‌, ఎరబోయిన మల్లేష్‌, కేఎం శంకర్‌, ముఠా గణేష్‌, ఎదమని కృష్ణారావు, చంద్రకళ, చరక సంగీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-09T14:40:54+05:30 IST