Share News

Hindupur Municipality : కుర్చీ కోసం..

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:02 AM

హిందూపురం మునిసిపల్‌ పీఠం కోసం ఆశావహులు ఆరాట పడుతుండగా, పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపాలిటీలో 38వార్డులు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30 స్థానాలు, టీడీపీ ఆరు, ఎంఐఎం, బీజేపీ చెరోస్థానం గెలుచుకున్నాయి. 19వ వార్డు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్‌ ఇంద్రజకు చైర్‌పర్సన పదవిని అప్పగించారు. ఈమె మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ...

Hindupur Municipality : కుర్చీ కోసం..
Hindupur Municipal Office

సందిగ్ధంలో చైర్మన పదవి

ఆశావహుల ఆరాటం

పురం మునిసిపల్‌ పీఠంపై ఉత్కంఠ

హిందూపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): హిందూపురం మునిసిపల్‌ పీఠం కోసం ఆశావహులు ఆరాట పడుతుండగా, పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపాలిటీలో 38వార్డులు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30 స్థానాలు, టీడీపీ ఆరు, ఎంఐఎం, బీజేపీ చెరోస్థానం గెలుచుకున్నాయి. 19వ వార్డు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్‌ ఇంద్రజకు చైర్‌పర్సన పదవిని అప్పగించారు. ఈమె మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వర్గం కావడంతో వైసీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌గా వచ్చిన దీపిక వర్గంతో అంటీముట్టనట్లు వ్యవహరించారు. దీంతో మునిసిపాలిటీలో చైర్‌పర్సన మాట జరగనీయకుండా దీపిక వర్గం అడ్డుకునేది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్బాల్‌తో పాటు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరాలని ఆమె భావించారు. కానీ అలా


జరగలేదు. ఎన్నికల అనంతరం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో ఆమె టీడీపీలో చేరారు. ఈమెతో పాటు మరో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. చైర్‌పర్సన పదవికి ఇంద్రజ రాజీనామా చేయడంతో నూతన చైర్మన ఎంపిక అనివార్యమైంది.

తొలగని ఉత్కంఠ

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన సభ్యులతో టీడీపీ బలం 18మందికి పెరిగింది. వీరికి ఎమ్మెల్యే, ఎంపీ ఓటు ఉండటంతో చైర్మన పదవికి కావాల్సినంత బలం టీడీపీకి ఉండేది. కానీ అనూహ్యంగా టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు పది రోజుల కిందట తిరిగి వైసీపీలో చేరారు. దీంతో ప్రస్తుతం టీడీపీ బలం 14కి పడిపోయింది. వైసీపీకి 24 మంది సభ్యుల బలం ఉందని చైర్మన పదవి కోసం కొంతమంది ఆశావహులు ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి వద్దకు వెళ్లారు. ఇందులో ముగ్గురు కౌన్సిలర్లు చైర్మన పదవి తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. స్థానికంగా మీరే నిర్ణయించుకోండని అధిష్టానం ఖర్చుపెట్టే పరిస్థితిలో లేదని ఆయన చెప్పడంతో వారంతా విజయవాడ నుంచి వెనుతిరిగి వచ్చారు. మరోసారి కర్ణాటకలో కూడా వైసీపీ క్యాంప్‌ రాజకీయానికి తెరలేపింది. మరో ఐదుగురు సభ్యులు కూడా వైసీపీలోకి చేరుతున్నట్లు పుకార్లు పుట్టించారు. కానీ ఆ తరువాత వైసీపీలోకి ఎవరూ వెళ్లలేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఓటు కలుపుకుని టీడీపీకి 16మంది సభ్యుల బలం ఉంది. కాగా వైసీపీకి చెందిన మరో ఆరుగురు సైకిల్‌ ఎక్కడానికి సిద్ధమైనట్లు సమాచారం. వారు వస్తే టీడీపీ బలం 22కు చేరుతుంది. అప్పుడు వైసీపీ బలం 18తో ఆగిపోతుంది.

సాంకేతిక సమస్యలతో సతమతం

సాధారణంగా జిల్లా పరిషత, మునిసిపల్‌, మండల పరిషత చైర్మన, అధ్యక్ష స్థానాలు మార్చాలంటే నాలుగేళ్లపాటు ఆగాలి. ఎన్నిక కాబడిన చైర్మన, ఎంపీపీలను నాలుగేళ్లపాటు మార్చేందుకు వీలులేకుండా గతంలో జీఓ విడుదల చేశారు. ఇదే ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. అయితే హిందూపురంలో చైర్‌పర్సన స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో చైర్మన ఎన్నికకు నిబంధన వర్తించదని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చైర్మనను ఎన్నుకునేందుకు మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్నికల సంఘానికి, మునిసిపల్‌ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రాష్ట్రంలో హిందూపురంతోపాటు మరికొన్ని మునిసిపల్‌ చైర్మనల ఎన్నిక జరగాల్సి ఉంది. ఒకటి రెండు చోట్ల సాంకేతికపరమైన సమస్యలు అడ్డంకిగా మారడంతో హిందూపురంలో కూడా చైర్మన ఎన్నిక వాయుదా పడుతూ వస్తున్నట్లు తెలుస్తుంది.

ఆశావహుల ఎదురుచూపు

ఇవన్ని ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొంతమంది వైసీపీ సభ్యులు రావడం, తిరిగి వెళ్లడంతోపాటు మరికొంతమంది తెలుగుదేశం వైపు చూస్తుండటంతో అటు వైసీపీ ఇటు టీడీపీలో చైర్మన పదవి ఆశిస్తున్నవారికి ఎదురుచూపులు మిగిలాయి. ఆరో వార్డు కౌన్సిలర్‌ డీఈ రమేష్‌ పేరును చైర్మన పదవికి ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైసీపీలో చైర్మన కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చైర్మనపదవి కోసం రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీపావళి తరువాత చైర్మన ఎన్నికకు అడ్డంకులు తొలగవచ్చని భావిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 20 , 2024 | 12:03 AM