Share News

Rama Naidu: జగన్‌కు ఆ అర్హత లేదు.. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:45 PM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌పై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా కూడా ఉండటానికి అర్హత లేదని ప్రజలు జగన్‌కు ప్రజా తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటికి ఆయన పద్ధతిలో మార్పు రావడం లేదని విమర్శించారు.

Rama Naidu: జగన్‌కు ఆ అర్హత లేదు.. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్
Nimmala Rama Naidu

అమరావతి: ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించే వీలు ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా సమస్యలను తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం దగ్గర అభివృద్ధికి సరిపడినంతా నిధులు లేకపోయినా ప్రజాసంక్షేమానికి కట్టుబడి పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపక్ష నేతగా కూడా ఉండటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్హత లేదని ప్రజలు ప్రజా తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికిజగన్ పద్ధతిలో మార్పు రావడం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.


ప్రభుత్వాన్ని జగన్ బెదిరిస్తున్నారు

ఆఫ్ఘానిస్తాన్, అమెరికాను బెదిరించినట్లు ప్రభుత్వాన్ని జగన్, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. జగన్ సింహం అని ఆ పార్టీ నేతలు అన్నారని... వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక విషసర్పం ఇద్దరు క్రూరమైన ప్రవృత్తి గలవారని ఆక్షేపించారు. సకల శాఖ మంత్రిగా సజ్జల వైసీపీ ప్రభుత్వంలో పని చేశారని గుర్తుచేశారు. మంత్రి లోకేష్ తన శాఖలో మంచిపేరు సంపాదించారని తెలిపారు. అందుకే ఆయనపై అక్కసుతో మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఆయన పద్ధతిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పరామర్శల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఆయనకు లేదని అన్నారు. Dr సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యంలను ఎలా చంపారో అందరికీ తెలుసునని చెప్పారు. రాష్ట్రంలో రిజర్వాయర్‌లు అన్నీ జలకళను సంతరించుకున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


రాయలసీమ అభివృద్ధికి కృషి..

జూలై నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు. రాయల సీమకు తాగు, సాగు నీరు పుష్కలంగా అందిస్తున్నామని అన్నారు. నాగార్జున సాగర్ పరిధిలో సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్ వద్ద జలకళ సంతరించుకుందని వివరించారు. వరద నీరు సముద్రంలోకి వెళ్లకుండా ట్యాంక్‌లు నింపుకోవాలని సూచించారు. కొన్ని కాల్వల్లో వృక్షాలు నిండి ఉన్నాయని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్‌లు ఆయకట్టు ఆఖరి ఎకరం వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖను జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు మూత వేశారని ఆరోపించారు. ఐదేళ్లలో ఇరిగేషన్ అధికారులు తమ పనులే మర్చిపోయిన పరిస్థితి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.


అధికారులు నిర్లక్ష్యంతో ఉంటే వదిలేది లేదు...

నీటి విడుదల విషయంలో కృష్ణా బోర్డు ఎస్‌ఈ నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. గతంలో పట్టిసీమ, కృష్ణా, బ్యారేజ్ వద్ద నీటిను రెండు కెనాళ్ల ద్వారా పంపమని, అయితే ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, రైతులు వద్ద ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారు. ఎంత నీరు విడుదల చేస్తున్నారని అడిగితే లేని పోని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. నిన్న గట్టిగా అధికారులను ప్రశ్నిస్తే 11 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వదిలామని చెప్పారని అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌లో ఉన్న నీటిని ఉపయోగించలేదని పై నుంచి విడుదల చేయలేదని అన్నారు. ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నామని, ఎస్ఈ ప్రసాద్ బాబును ఈఎన్సీకి సరెండర్ చేయాలని అదేశించామని అన్నారు. నిర్లక్ష్యంతో ఉన్నఅధికారులను వదిలేది లేదని హెచ్చరించారు. ఈ శాఖకు అనుగుణంగా అధికారులు పని చేయాల్సి ఉందని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తమకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని అన్నారు. ప్రతి చుక్కను సద్వినియోగం చేయాలని చూస్తున్నామని, అయితే కొన్ని చోట్లా గండ్లు పడుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 05:01 PM