Ramachandra Yadav: మంత్రి పెద్దిరెడ్డి రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు
ABN , Publish Date - Jan 21 , 2024 | 08:54 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ) రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ( Ramachandra Yadav ) హెచ్చరించారు.
విజయవాడ: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ) రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ( Ramachandra Yadav ) హెచ్చరించారు. ఆదివారం ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ని కలిసి అనేక అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ... వారం క్రితం పుంగనూరులో రైతుల సమస్యల సభ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని.. కావాలని మంత్రి పెద్దిరెడ్డికి అనుకూలంగా పోలీసులు పనిచేసి సభకు పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని ఆరోపించారు. జగన్, పెద్దిరెడ్డి సామాంతులుగా పోలీసులు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులు కూడా కొంతమంది వ్యక్తుల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. పల్లెల్లో పండుగలు చేసుకునే వాతావరణము కూడా లేదన్నారు. ఏపీలో ఉన్న అన్ని సమస్యలపై గవర్నర్కి ఫిర్యాదు చేశామని ఆయన సానుకూలంగా స్పందించారని రామచంద్రయాదవ్ తెలిపారు.