Share News

YSRCP: వైసీపీలో కలవరం.. వణికిపోతున్న నేతలు..!

ABN , Publish Date - May 28 , 2024 | 01:40 AM

ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్నకొద్దీ వైసీపీ అభ్యర్థులు, నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

YSRCP: వైసీపీలో కలవరం.. వణికిపోతున్న నేతలు..!
YS Jagan

  • కూటమికి మొగ్గు చూపుతున్న అత్యధిక సర్వే సంస్థలు

  • అధికార పార్టీ అభ్యర్థుల్లో అయోమయం

  • ఒకవేళ ప్రభుత్వం రాకపోయినా తాము గెలిస్తే ఏదోవిధంగా నిలదొక్కుకోవచ్చునని ఆశ

  • తాము ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే చాలనుకుంటున్న మరికొందరు...

  • తామూ ఓటమిపాలై, ప్రభుత్వమూ రాకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్నకొద్దీ వైసీపీ అభ్యర్థులు, నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వస్తుండడంతో గెలుపుపై ఒక్కొక్కరిలో ధీమా సడలుతోంది. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం తాము గెలిచినా పర్వాలేదని, అలాకాకుండా తాము ఓటమి పాలైనా పార్టీ అధికారంలోకి వచ్చినా ఇబ్బంది ఉండదని...ఈ రెండు కాకుండా పార్టీ అధికారంలోకి రాకుండా, తాము కూడా ఓడిపోతే భవిష్యత్తులో పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు.


నగరంలో ఎక్కడచూసినా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపైనే చర్చ జరుగుతోంది. పోలింగ్‌ ముందు నుంచి రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, గత ఎన్నికల్లో సాధించిన సీట్లు కంటే ఎక్కువ రాబోతున్నాయంటూ వైసీపీ అనుకూల మీడియాలో ఊదరగొట్టింది. పోలింగ్‌ తర్వాత కూడా దానిని కొనసాగిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల ఫలితాలు అంచనాలకు మించి రాబోతున్నాయని, గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ఇది వైసీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.

మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మరో అడుగుముందుకు వేసి జూన్‌ తొమ్మిదిన వైఎస్‌ జగన్‌మోహన్‌రడ్డి రెండోసారి సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో ధీమాను పెంచింది. దీంతో రాష్ట్రంలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, విశాఖలో హోటళ్లన్నీ జూన్‌ 8, 9 తేదీల్లో ఫుల్‌ అయిపోయాయంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధిక సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయని అత్యధిక సర్వే సంస్థలు, రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు చెబుతుండడంతో వైసీపీ అభ్యర్థులు, నేతలు లోలోన కంగారు పడుతున్నారు.


దీనికితోడు బెట్టింగ్‌లు కూడా ఏకపక్షంగా సాగుతున్నాయి. కూటమి విజయం సాధిస్తుందని పందెం కాసేందుకు ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారు. వైసీపీ వైపు కాసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో 1ః2 నిష్పత్తి (అంటే కూటమి గెలుస్తుందనేవారు రూ.100, వైసీపీ విజయం సాధిస్తుందనేవారు రూ.50 పెడతారు) జరుగుతున్నాయి. ఇది కూడా వైసీపీ నేతలకు గుబులుపుట్టిస్తోంది. ఎన్నికల్లో విజయం కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా ఖర్చు చేశామని, ఇప్పుడు తాము ఓడిపోయి, పార్టీ అధికారంలోకి రాకపోతే ఏం చేయాలని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి రాకపోతే తాము చేసిన ఖర్చు బూడిదలో పోసినట్టేనని నిట్టూరుస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం తాము గెలిచినా ఏదోలా ఐదేళ్లు నెట్టుకొచ్చేయవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

అలాకాకుండా తాము కూడా ఓడిపోతే మాత్రం అధికార పార్టీ తమను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోసం చేసిన అప్పులను తీర్చడానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుందంటున్నారు. బయటవారు తమను కలిసినప్పుడు అభ్యర్థులు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా...తమ సన్నిహితులు, ఆప్తులు కలిసినప్పుడు మాత్రం తమ పరిస్థితి, భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ఎన్ని యాత్రలు చేసినా ఫలితం కనిపించడం లేదని, జూన్‌ నాలుగు వరకూ ఈ పరిస్థితి తప్పదని వాపోతుండడం గమనార్హం.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 08:17 AM