Share News

Mumbai: వర్ష భీభత్సం..

ABN , Publish Date - Jul 26 , 2024 | 06:12 AM

ఎడతెరిపి లేని వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. రాజధాని ముంబై, ఐటీ సంస్థల కేంద్రం పుణెతో పాటు రాయ్‌గఢ్‌, పాల్ఘ ర్‌ జిల్లాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.

Mumbai: వర్ష భీభత్సం..

  • మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ రాష్ట్రాలలో కుండపోత

ముంబై, పుణె, జూలై 25: ఎడతెరిపి లేని వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. రాజధాని ముంబై, ఐటీ సంస్థల కేంద్రం పుణెతో పాటు రాయ్‌గఢ్‌, పాల్ఘ ర్‌ జిల్లాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌లతో పాటు రైల్‌ సర్వీసులు ఆలస్యం అయ్యాయి. రాగల 24 గంటల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సాయన్‌, చెంబూర్‌, అంధేరీల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. శుక్రవారం ఉదయం వరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. పుణెతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పుణెలో దక్కన్‌ జింఖానా వద్ద వీధి వ్యాపారులు ముగ్గురు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు.


మరొకరు వర్షాలకు మృతిచెందారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇక్కడివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నగరానికీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. థానె, పాల్ఘర్‌ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మనాలీలో క్లౌడ్‌ బర్‌స్టతో కుంభవృష్టి కురిసింది. అంజనీ మహదేవ్‌ కాల్వ పోటెత్తింది. ఈ కాల్వలోని రాళ్లు.. మనాలీ-లేహ్‌ జాతీయ రహదారిపై ఉన్న వంతెనపైకి వచ్చాయి. గుజరాత్‌లోని కశ్మీర్‌ నగర్‌లో ఔరంగా నది ఉప్పొంగడం తో తక్షణమే 150 కుటుంబాలను ఖాళీ చేయించారు. యూపీలోని మొరాదాబాద్‌ను భారీ వర్షాలు కుదిపేశాయి.

Updated Date - Jul 26 , 2024 | 06:12 AM