Share News

SriNagar: జమ్ము కాశ్మీర్‌లో అధికారమే లక్ష్యంగా..

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:51 PM

ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

SriNagar: జమ్ము కాశ్మీర్‌లో అధికారమే లక్ష్యంగా..

ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రపంచ యోగా దినోత్సం..

జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం. ఆ రోజు శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలో దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే రాష్ట్రంలో జరిగే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా స్థానిక యువతతో ఆయన మచ్చటించేలా ఓ కార్యక్రమాన్ని సైతం రూపొందించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మోదీ.. ఆ రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు.


అమిత్ షా అధ్యక్షతన...

మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకు జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రదాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదం అణచివేతకు కఠినమైన చర్యలు అవలంభించాలని ఉన్నతాధికారులకు మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు.


అర్టికల్ 370 రద్దు అనంతరం..

ఇంకోవైపు జమ్ము కాశ్మీర్‌లో అర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం సైతం స్వాగతించిన సంగతి తెలిసిందే. అటువంటి వేళ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారనేది సుస్పష్టం కానుంది.


కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు..

అదీకాక ఈ ఏడాది సెప్టెంబర్‌ లోపు జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో జమ్ము కాశ్మీర్‌లో ఎన్నికల నగారా మోగనుంది. ఇక జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని బీజేపీ అగ్రనాయకత్వం నియమించింది. అలాంటి వేళ ప్రధాని మోదీ.. జమ్ము కాశ్మీర్‌లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తున్నట్లు సుస్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 08:58 PM