Share News

Farmers protest: రైతులను మందలించిన పంజాబ్ హర్యానా హైకోర్టు

ABN , Publish Date - Feb 20 , 2024 | 07:32 PM

కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్‌తో సహా పలు డిమాండ్ల సాధనకు ఆందోళన సాగిస్తున్న రైతులను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మంగళవారంనాడు మందలించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై వారు ట్రాక్టర్ ట్రాలీలను వాడరాదని స్పష్టం చేసింది.

Farmers protest: రైతులను మందలించిన పంజాబ్ హర్యానా హైకోర్టు

ఛండీగఢ్: కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్‌తో సహా పలు డిమాండ్ల సాధనకు ఆందోళన సాగిస్తున్న రైతులను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు (Punjab and Haryana court) మంగళవారంనాడు మందలించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై వారు ట్రాక్టర్ ట్రాలీలను వాడరాదని స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కుల గురించి తెలిసిన వారు రాజ్యాంగ బాధ్యతలను సైతం విస్మరించరాదని పేర్కొంది.


పెద్ద సంఖ్యలో జనం గుమిగూడరాదు...

ప్రజలు పెద్ద సంఖ్యలో ఎక్కడా జమకాకుండా చూడాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ''వాళ్లకు (రైతులకు) నిరసనలు తెలిపే హక్కు ఉంది. అయితే అదికూడా సహేతుకమైన ఆంక్షలకు లోబడి ఉండాలి'' అని కోర్టు తెలిపింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూ, ఆందోళనకు దిగిన రైతులతో వారి డిమాండ్లపై చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ, రైతులతో చర్చల్లో పురోగతిపై తాజా అఫిడవిడ్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.


ప్రభుత్వ ప్రతిపాదనకు రైతులు 'నో'

ఐదు పంటలను ఐదేళ్ల పాటు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు సోమవారంనాడు జరిగిన చర్చల్లో తోసిపుచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదన రైతులకు అనుకూలంగా లేదంటూ తేల్చిచెప్పారు. ప్రభుత్వం కొత్తగా చేసిన ప్రతిపాదన ఏదీ లేదని, అది రైతులకు ప్రయోజనం చేకూరే ప్రతిపాదన కాకపోవడంతో నిర్ద్వంద్వంగా తాము తోసిపుచ్చామని రైతు నేత జగ్జిత్ సింగ్ దలేవాల్ తెలిపారు. బుధవారం నుంచి 'ఢిల్లీ ఛలో' ర్యాలీని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 07:32 PM