Share News

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అమెరికా టూర్ వెనుక నివ్వెరపోయే నిజాలివే..!

ABN , Publish Date - May 22 , 2024 | 11:13 AM

ఏపీలో ఎన్నికలు మాత్రమే జరిగాయి.. ఇంకా ఫలితాలు రాలేదు. ఏ పార్టీ గెలుస్తుందనేది జూన్-04న తేలిపోనుంది. ఈ గ్యాప్‌లో గన్నవరం వల్లభనేని వంశీ.. అమెరికా చెక్కేశారు. అసలు ఆయన అమెరికా ఎందుకెళ్లారు.. ఈ టూర్ వెనుక ఉన్న షాకింగ్ విషయాలేంటి..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అమెరికా టూర్ వెనుక నివ్వెరపోయే నిజాలివే..!

  • వంశీపై ఈబీ-5 దుమారం!

  • అమెరికాలో సుమారు రూ.9 కోట్లు పెట్టుబడితో గ్రీన్‌కార్డు

  • దీన్నే ఈబీ 5 ఇమ్మిగ్రెంట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోగ్రాంగా పిలుపు

  • గ్రీన్‌ కార్డు కోసమే వంశీ అమెరికాలో పెట్టుబడులు పెట్టారని ప్రచారం

  • అదంతా గన్నవరం నియోజకవర్గంలో దోచిందేనంటున్న టీడీపీ నాయకులు


అమెరికా గ్రీన్‌కార్డు సాధించడం అంటే సామాన్యులకు అంత ఆషామాషీ కాదు. కానీ డబ్బులున్న వారికి ఓ దగ్గర దారుంది. అదే ఈబీ 5 ఇమ్మిగ్రేషన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోగ్రాం. దీన్నే సింపుల్‌గా ఈబీ 5 వీసా అంటారు. అమెరికాలో ఓ వాణిజ్య సంస్థని ఏర్పాటు చేసి అందులో సుమారు 10 లక్షల అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ.9 కోట్లు) పెట్టుబడిగా పెట్టి అర్హత కలిగిన 10 మంది అమెరికన్లకు ఫుల్‌ టైం ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి వారికి ఈబీ 5 వీసా మంజూరు చేస్తారు. ఏడాదిలోపు గ్రీన్‌కార్డు ఇస్తారు. ఇప్పుడు ఈ ఈబీ 5 వీసాపై ఎందుకింత చర్చ అంటే.. గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మే 17న అమెరికాలోని డల్లాస్‌ వెళ్లారు. తన పిల్లల చదువు కోసం అమెరికా వెళ్లారని ఆయన అనుచరులు.. లేదు లేదు వంశీ శాశ్వతంగా అమెరికా వెళ్లిపోయారని, ఆయనకు అక్కడ ఈబీ 5 వీసా కూడా మంజూరైందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

గన్నవరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఈసారి విద్వేష రాజకీయాలకు తెరదీశారు. ఓటమి భయంతో ప్రత్యర్థులను దాడులతో భయభ్రాంతులకు గురి చేసి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో గ్రావెల్‌, పోలవరం మట్టి దోపిడీతో వంశీ, ఆయన అనుచరులు వందల కోట్లు ఆర్జించారు. ఈ నేపథ్యంలో వంశీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆయనపై ప్రత్యర్థులు అదే స్థాయిలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తెలుగువారందరిలోనూ వంశీపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకున్న వంశీ గత ఏడాదిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. అందులో భాగంగా ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే నియోజకవర్గానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం.

Vallabhaneni Vamsi: గన్నవరంలో మాయమై డల్లాస్‌లో వల్లభనేని వంశీ ప్రత్యక్షం.. ఎందుకా అని ఆరాతీస్తే..?



Vallabhaneni-Vamsi.jpg

వ్యూహాత్మకంగానే దుట్టా పేరు ప్రకటన

పోలింగ్‌కు ముందు.. వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు సతీమణి దుట్టా సీతారామలక్ష్మి పోటీ చేస్తుందని తాను ఆమెకు మద్దతు ఇస్తానని వంశీ ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే తనకు నియోజకవర్గంలో మనుగడ ఉండదన్న అభిప్రాయానికి వంశీ వచ్చారని ఆయన మాటలే చెబుతున్నాయి. అందుకే ఏడాదిగా ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే అమెరికాలోని రెండు కంపెనీల్లో ఆయన సుమారు రూ.20 కోట్లపైచిలుకు పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. తద్వారా ఈబీ 5 వీసాకు దరఖాస్తు చేసుకోవడం.. గ్రీన్‌కార్డు రావడం అన్నీ పూర్తయ్యాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Dutta-And-Vamsi.jpg

ఇక్కడ దోచి.. అమెరికాలో పెట్టుబడి పెట్టి..

అమెరికాలో పెట్టుబడిగా పెట్టిన సొమ్ము మొత్తం గన్నవరం నియోజకవర్గంలో దోచుకున్నదేననే చర్చ నడుస్తోంది. యార్లగడ్డ అమెరికాలో సంపాదించి నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నారని, వంశీ ఇక్కడ దోచుకుని అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గన్నవరం నుంచి 2109లో టీడీపీ టికెట్‌పై గెలిచి వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ స్వగ్రామం గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు. 2014, 2019లో రెండు సార్లు టీడీపీ టికెట్‌పై గన్నవరం ఎమ్మెల్యే వంశీ గెలుపొంది గన్నవరంపై పట్టు బిగించారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఆయన అనుచరులు సాగింన అవినీతికి అంతే లేదు. దీంతో ఈసారి ఓటమి భయం వంశీని వెంటాడుతోంది. దాని ఫలితమే రాజకీయ కక్ష సాధింపులు నుం తప్పించుకోవడానికి వంశీ అమెరికా బాట పట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన అనుచరులు మాత్రం వంశీ మే 17న తన కుమారుడి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని డల్లాస్‌ వెళ్లారని, త్వరలోనే తిరిగి వస్తారని చెబుతున్నారు.

Read more AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 11:13 AM