Share News

MLC Kavita: ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:34 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది.

MLC Kavita: ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు

  • నివేదికలు తమకు సమర్పించాలని కోర్టు ఆదేశం

  • జ్యుడీషియల్‌ కస్టడీ 22 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో గురువారం ఆమెను వర్చువల్‌గా ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కవిత ఆరోగ్యం బాగా లేదని, జ్వరంతో బాధపడుతున్నారని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జి కావేరి భవేజా దృష్టికి తీసుకెళ్లారు. తాను గైనిక్‌ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని, జైలులో వసతులు సరిగా లేవని, సరైన వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులో లేరని స్వయంగా కవిత.. న్యాయమూర్తికి తెలిపారు.


జ్వరంతో ఇబ్బంది పడుతున్నానని, ఆరోగ్యం బాగా క్షీణించిందన్నారు. కవిత ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారని, అక్కడ కూడా సరైన వసతులు లేవని ఆమె తరఫున న్యాయవాది మోహిత్‌ రావు వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జడ్జి కవితకు ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని జైలు అధికారులను ఆదేశించారు.


శుక్ర, శనివారాల్లో వైద్య పరీక్షలు పూర్తిచేయాలని, సోమవారంలోపు రిపోర్టులు న్యాయస్థానంలో సమర్పించాలన్నారు. వైద్య పరీక్షల సమయంలో కవితతోపాటు అమె భర్త అనిల్‌ తోడుగా ఉండవచ్చన్నారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 22 (సోమవారం) వరకు జడ్జి కావేరి భవేజా పొడిగించారు. సీబీఐ ఛార్జిషీట్‌, కవిత బెయిల్‌ పిటిషన్లపై కూడా సోమవారమే విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కస్టడీని 22వ తేదీ వరకు పొడిగించారు.

Updated Date - Jul 19 , 2024 | 04:34 AM