Share News

Dundigal : ఇన్‌స్టా ప్రేమ.. యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడి బలవన్మరణం

ABN , Publish Date - Aug 14 , 2024 | 06:05 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరిట వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి(21) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 Dundigal : ఇన్‌స్టా ప్రేమ.. యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడి బలవన్మరణం

దుండిగల్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరిట వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి(21) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దోమడుగుకు చెందిన తేజస్విని(20) అనే బీఫార్మసీ విద్యార్థినికి శ్రీహరి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ప్రేమ, పెళ్లి పేరిట తేజస్వినిని వేధించాడు. ఈ వేధింపులు తాళలేక తేజస్విని ఈ నెల 8న తమ ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి భయపడిన శ్రీహరి మరుసటి రోజు ఆగస్టు 9న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కుటుంబసభ్యులు శ్రీహరిని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాపాయం తప్పడంతో వైద్యులు శ్రీహరిని ఐసీయూ నుంచి జనరల్‌ వార్డుకు మార్చారు. అయితే మంచినీళ్లు తాగి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి సోమవారం అర్ధరాత్రి ఆస్పత్రి జనరల్‌ వార్డు నుంచి వెళ్లిన శ్రీహరి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుండిగల్‌ గండిమైసమ్మ మండలంలోని బహదూర్‌పల్లిలోని ఓ సొసైటీలోని చెట్టుకు గుర్తు తెలియని యువకుడు ఉరివేసుకున్నాడని మంగళవారం ఉదయం పోలీసులకు అందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్నది శ్రీహరి అని గుర్తించారు.

Updated Date - Aug 14 , 2024 | 07:40 AM