Share News

Hyderabad Metro: నాగోల్ మెట్రో వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:20 PM

మెట్రో ప్రయాణికులు ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు చూసి అవాక్కయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర జీతాలతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా అదనంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణం అని మండిపడ్డారు

Hyderabad Metro: నాగోల్ మెట్రో వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?

హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు నాగోల్ మెట్రో స్టేషన్‌ వద్ద ఉన్న వాహనాల ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ్టి(ఆగస్టు 14) నుంచి వాహనాల పార్కింగ్‌కు నిర్ణీత నగదు చెల్లించాలంటూ మెట్రో ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనాన్ని 2గంటలు పార్కింగ్ చేస్తే రూ.10, అలాగే 8గంటలపాటు చేస్తే రూ.25 చెల్లించాలి. 12గంటలపాటు పార్క్ చేయాల్సి వస్తే రూ.40కట్టాలి. దీంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు.


అయితే ఇవాళ ఉదయం పార్కింగ్ చేసేందుకు వెళ్లిన మెట్రో ప్రయాణికులు ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు చూసి అవాక్కయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర జీతాలతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా అదనంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణం అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు రోజుకు రూ.40 అంటే నెలకు రూ.1200 వందలు చెల్లించాలని, దీని వల్ల తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని వారు వాపోయారు. చిరు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే ఈ నిబంధన తొలగించి ఎప్పటిలాగానే ఉచిత సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.


Hyderabad-Metro.jpg

అలాగే ఓ కారు రెండు గంటలపాటు పార్క్ చేస్తే రూ.30, 8గంటలకు అయితే రూ.75, 12గంటలపాటు పార్క్ చేస్తే రూ.120 చెల్లించాలి. అదనంగా ఒక్కో గంటకు మరో రూ.5చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 40శాతం డిస్కౌంట్‌తో నెలవారీ పాసులు ఇచ్చేందుకు సైతం మెట్రో అధికారులు సౌలభ్యం కల్పించారు. పోనీ ఇంత నగదు వసూలు చేసినప్పటికీ కూడా వాహనాల భద్రతకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. వాహనాలు దొంగతనాలకు గురైనా, దెబ్బతిన్నా, ఏవైనా వస్తువులు పోయినా తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అధికారులు బోర్డు పెట్టడంపైనా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Hyderabad-Metro-3.jpg

హైదరాబాద్ మెట్రోలో రోజుకు సుమారు 4నుంచి 5లక్షల మంది ప్రయాణిస్తున్నారు. చాలా మంది తమ ఇంటి సమీపంలోని మెట్రో వద్దకు సొంత వాహనాలపై వచ్చి అక్కడ్నుంచి మెట్రోకు వెళ్తుంటారు. వీరందరిపైనా భారం పడనుంది. పార్కింగ్ ఫీజు చెల్లించేందుకు యాప్ డౌన్ లోడ్ చేసువాల్సి ఉంటుంది. అయితే అలా డౌన్ లోడ్ చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ ఏరియా కూడా అధ్వానంగా ఉంటుందని, పైగా వాహనాలకు సైతం గ్యారెంటీ లేకపోతే పార్కింగ్ ఫీజు చెల్లించడంలో అర్థం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో మెట్రో అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - Aug 14 , 2024 | 03:36 PM