Share News

TS NEWS: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 24 , 2024 | 10:00 PM

నిజాం షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధ రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శనివారం బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు.

TS NEWS: గత బీఆర్ఎస్ ప్రభుత్వం  ఖజానా ఖాళీ చేసింది.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లా: నిజాం షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధ రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శనివారం బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఫ్యాక్టరీను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ భూములు బ్యాంక్ లోన్‌లో ఉన్నాయని తెలిపారు. చెరుకును పండించాలని రైతులను కోరారు. చెరుకు సాగు చేసే రైతులకు అమ్మకపు పన్ను, సబ్సిడీ, ట్రాన్స్ పోర్ట్ సబ్సిడీని ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పం.. రైతుల సహకారంతో లాభాల్లో ఉండే విధంగా ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 10 ఏళ్లు గడిచిన కేంద్రప్రభుత్వం చెరుకు పంటను పట్టించుకోలేదని మండిపడ్డారు. 2015లో లే ఆఫ్ అయితే కార్మికులు, రైతుల గురించి మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కొత్త వంగడాల కోసం వ్యవసాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరారని.. ఇక మార్పు చూపెడతామని తెలిపారు.

జువ్వాడి రత్నాకర్ రావు కమిటీ ఆ విషయం చెప్పింది

ప్రజా సంక్షేమం కోసం వ్యతిరేకంగా ఉన్నవారికి ఈ ఫ్యాక్టరీ గేట్లను మూసేస్తామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేయడంతో అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. 2014లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని జువ్వాడి రత్నాకర్ రావు కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోయామని, రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే రెండు ప్రధాన అంశాలు అమలు చేశామని వివరించారు. 27వ తేదీన మరో రెండు పథకాలు అమలు చేస్తామని.. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ రెండు పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. రైతు బంధును రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, గుట్టలకు ఇస్తున్నారనే విషయం పరిశీలనలో ఉందని చెప్పారు. మరో 5ఏళ్లలో రిజనల్ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో ఐటీ పరిశ్రమలు, రిజనల్ రింగ్ రోడ్డులో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే ఎంఎస్పీ పాలసీని ప్రభుత్వం తీసుకు వస్తుందని అన్నారు. యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Updated Date - Feb 24 , 2024 | 10:00 PM