Share News

Hyderabad: ఫార్ములా 1540

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:46 AM

ఫార్ములా వన్‌ రేసులు కోసం తెలుసా.. !! ఈ రేసుల్లో పాల్గొనే కార్లు ట్రాక్‌పై అత్యధికంగా గంటకు 375 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు రికార్డులు ఉన్నాయి.

Hyderabad: ఫార్ములా 1540

  • గంటకు 1,540 కి.మీ.లు.. 48 గంటల్లో 74 వేల కి.మీ.ల ప్రయాణం !

  • రెండు రోజుల్లో వేల కిలో మీటర్లు చుట్టేసిన ఓ వాహనం

  • గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో బయటపడిన వింత

  • తప్పుడు బిల్లులతో భారీగా నగదు లూటీ

  • మహబూబ్‌నగర్‌కు కేటాయించిన బిల్లులో గుర్తించిన ఏసీబీ

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా వన్‌ రేసులు కోసం తెలుసా.. !! ఈ రేసుల్లో పాల్గొనే కార్లు ట్రాక్‌పై అత్యధికంగా గంటకు 375 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు రికార్డులు ఉన్నాయి. ఈ కార్లను మించిన వేగంతో రాష్ట్రంలో ఓ వాహనం దూసుకెళ్లిందనే విషయం మీకు తెలుసా ? ఓ వాహనం 48 గంటల వ్యవధిలో ఏకంగా 74వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అంటే గంటకు 1540 కిలోమీటర్లు చొప్పున వాయువేగంతో దూసుకెళ్లింది. ఏంటి నిజమేనా అనుకుంటున్నారా.. ? గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ వింతను గుర్తించినట్టు సమాచారం. గొర్రెల రవాణాకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయించిన బిల్లులో ఈ విడ్డూరం బయటపడగా పెద్ద మొత్తంలో నిధుల గోల్‌మాల్‌ జరిగినట్టు తెలిసింది.గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అక్రమాలకు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయించిన బిల్లులో ఓ వాహనం రెండ్రోజుల్లో 74 వేల కిమీలు ప్రయాణించినట్టు పేర్కొని ఉండడాన్ని గుర్తించినట్టు సమాచారం. 2018 ఫిబ్రవరి 20 నుంచి 22 వరకు కేవలం రెండు రోజుల్లో ఓ వాహనం మీటర్‌ రీడింగ్‌ ఏకంగా 74 వేల కిలోమీటర్లపైగా తిరిగినట్లు పేర్కొని అందుకు తగ్గ డబ్బులు చెల్లించి, వాటిని బినామీల ఖాతాల్లోకి దారి మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై తమకు అనుకూలంగా బిల్లులు, నకిలీ ఇన్వాయి్‌సలు సృష్టించి ఈ అక్రమానికి పాల్పడినట్టు కనిపెట్టారు. అంతేకాదు ఒక వాహనం ఒకే రోజు శ్రీకాకుళం నుంచి మహబూబ్‌నగర్‌, కడప నుంచి మహబూబ్‌నగర్‌ తిరిగినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు తీసుకున్న విషయం దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది.


ఈ గొర్రెల రవాణా విషయంలో ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీగా వ్యవహరించిస సంస్థకు ఎండీ అయిన మొహిదొద్దీన్‌ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించాడని అధికారులు ఇప్పటికే గుర్తించారు. కేసు నమోదైనప్పటి నుంచి మొహిదొద్ద్దీన్‌ ఆయన కుమారుడు దుబాయ్‌లో తలదాచుకున్నారు. కేసుతో తమకు సంబంధం లేదని, కేవలం రవాణా వరకే చూసుకున్నామని ముందస్తు బెయిల్‌ కోరిన సమయంలో మొహిదొద్దీన్‌ కోర్టుకు వివరించారు. అయితే గొర్రెల రవాణాలోనూ అక్రమాలు బయటపడుతుండడంతో మొహిదొద్దీన్‌ను పట్టుకుని విచారణ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. రూ.700 కోట్ల గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి తమకు బిల్లులు చెల్లించలేదంటూ నల్లగొండకు చెందిన సుమారు 30 మంది రైతులు ఏసీబీ అధికారులను గురువారం ఆశ్రయించారు. అధికారులు వారి నుంచి వివరాలు సేకరించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాలకు చెందిన బాధితుల నుంచి కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Updated Date - Jul 19 , 2024 | 05:46 AM