Share News

Kaloji Narayana Rao: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి షెడ్యూల్‌

ABN , Publish Date - Aug 04 , 2024 | 04:50 AM

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్‌ రాసిన విద్యార్థుల ర్యాంకులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈ దఫా 49,184 మంది క్వాలిఫై అయునట్లు గుర్తించింది.

Kaloji Narayana Rao: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి షెడ్యూల్‌

  • నేటి నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ

  • నీట్‌లో అర్హత సాధించిన 49,184 మంది ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్‌ రాసిన విద్యార్థుల ర్యాంకులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈ దఫా 49,184 మంది క్వాలిఫై అయునట్లు గుర్తించింది. జాబితాలో ఉన్న కన్వీనర్‌ కోటాలో సీట్ల కోసం ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయం త్రం 6 గంటలదాకా వర్సిటీ వెబ్‌సైట్‌(https://tsmed adm.tsche.in)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితాను విడుదల చేస్తామని ప్రకటించింది.


ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్ల స్వీకరణ ఉంటుందని, కళాశాలలు, సీట్ల వివరాలను వెబ్‌ ఆప్షన్లకు ముందే వెల్లడిస్తామని పేర్కొంది. గత నెలలో జారీ చేసిన జీవో 33 జీవో ప్రకారం 85 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో, 15 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేయనున్నారు. ఇక ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 50శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో, మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. కాగా, స్థానికతను గుర్తించే విషయంలోనూ స్వల్ప మార్పులు చేశారు. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్‌ దాకా 7ఏళ్ల కాలంలో గరిష్ఠంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణనలోకి తీసుకునే వారు. ఈ సారి మాత్రం 9వ తరగతి నుంచి ఇంటర్‌ దాకా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారనే దానితో సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


పీజీ డెంటల్‌ నోటిఫికేషన్‌ విడుదల

వరంగల్‌ మెడికల్‌: రాష్ట్రంలో పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎండీఎస్‌ కోర్సులో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్‌, ఎండీఎస్‌ 2024 పరీక్షలో అర్హత సాధించిన వారు 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ పేర్కొంది.

Updated Date - Aug 04 , 2024 | 04:50 AM