Share News

Bhadradri Kothagudem: 5 జిల్లాల్లో సికిల్‌సెల్‌ తీవ్రత

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:35 AM

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సికిల్‌ సెల్‌ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. సికిల్‌సెల్‌ ఎక్కువగా గిరిజన, మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోనే ఉంటుంది.

Bhadradri Kothagudem: 5 జిల్లాల్లో సికిల్‌సెల్‌ తీవ్రత

  • ఐదు నెలల్లో 848 కేసులు నమోదు

  • రాష్ట్రవ్యాప్తంగా 5,038 మంది క్యారియర్స్‌

  • తాజా స్ర్కీనింగ్‌లో బయటపడ్డ కేసులు

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సికిల్‌ సెల్‌ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. సికిల్‌సెల్‌ ఎక్కువగా గిరిజన, మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోనే ఉంటుంది. పైన పేర్కొన్న ఐదు జిల్లాలూ ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్నవే. ఇక్కడ కేసులు పెరగడంతో పాటు క్యారియర్స్‌ సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ జనవరి- మే మధ్య అన్ని జిల్లాల్లో సికెల్‌ సెల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించింది. ఆ వివరాలను వైద్యశాఖ ప్రభుత్వానికి అందజేసింది. భద్రాది జిల్లాలో 97,687 మంది అనుమానితులను పరీక్షించగా అత్యధికంగా 1,636 మంది క్యారియర్స్‌గా, 442 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.


మహబూబాబాద్‌ జిల్లాల్లో 78,025 మందికి పరీక్షలు చేయగా.. 379 మంది క్యారియర్స్‌గా, 88 మందికి సికెల్‌ సెల్‌ ఉన్నట్లు తేలింది. ఆదిలాబాద్‌లో 1140 మంది క్యారియర్స్‌, 178 కేసులు, ఖమ్మంలో 213 మంది క్యారియర్స్‌ 154 కేసులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 704 క్యారియర్స్‌ 136 కేసులు నమోదయ్యాయి. క్యారియర్స్‌ పరంగా చూస్తే మంచిర్యాల జిల్లాలో 824, ములుగులో 38, హైదరాబాద్‌లో 70, కరీంనగర్‌లో 38 మంది ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 5,083 మంది క్యారియర్స్‌గా తేలగా.. ఐదు నెలల్లో 848 సికిల్‌ సెల్‌ కేసులు నమోదయ్యాయి. జనవరి-జూన్‌ మధ్య రాష్ట్రంలో 78 మలేరియా కేసులు వచ్చాయి. వీటిలో అత్యధికం భద్రాద్రి జిల్లా (32)వే. తర్వాత ఆసిఫాబాద్‌ ఉంది.


ఏమిటీ సికిల్‌సెల్‌...

సికిల్‌ సెల్‌ అనేది జన్యుపరమైన వ్యాధి. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు గుండ్రంగా పిప్పర్‌మెంట్‌ ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తనాళాల ద్వారా శరీరమంతా తిరుగుతూ అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంటాయి. కొందరిలో జన్యుపరమైన మార్పుల వల్ల ఎర్ర రక్తకణాలు గుండ్రంగా బదులు కొడవలి (సికిల్‌) ఆకారంలో ఉంటాయి. ఇలా ఉన్నవారి రక్త కణంలోని ఒక జన్యువు సికెల్‌ సెల్‌గానూ, మరొకటి మాములుగానూ ఉంటే వారిని సికిల్‌సెల్‌ క్యారియర్స్‌ అంటారు. వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలుండవు. ఇలాంటివారు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యభర్తలిద్దరికి ఆ లక్షణాలుంటే వారికి పుట్టే పిల్లలకు రక్తంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి.


పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవిత కాలం నాలుగు నెలలైతే సికిల్‌ సెల్‌ జీవిత కాలం 25 రోజులే. ఇవి నశించేంత వేగంగా కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. దాంతో ఈ వ్యాధి ఉన్నవారు తీవ్ర రక్తహీనత బారినపడతారు. శరీర భాగాలకు సరిగా ఆక్సిజన్‌ అందక అనారోగ్యానికి గురవుతారు. దీర్ఘకాలం కామెర్లు, రక్త హీనతతో శరీరం పాలిపోయి ఉండడం, కాళ్లు, చేతుల వేళ్లు వాపుతో వంపు తిరగడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.

Updated Date - Jul 27 , 2024 | 03:35 AM