Share News

Peddapalli: తవ్వకాల తిప్పలు!

ABN , Publish Date - May 27 , 2024 | 03:53 AM

త ప్రభుత్వం చేపట్టిన అక్రమ ఇసుక తవ్వకాల తాలూకు విపరిణామాలు ప్రస్తుత ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ఆదాయమే లక్ష్యంగా గత బీఆర్‌ఎస్‌ సర్కారు నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన ఇసుక తవ్వకాలపై ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ, మైనింగ్‌ శాఖలకు చెనైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌ కోర్టు రూ.25 కోట్ల చొప్పున తాత్కాలిక జరిమానా విధించడం తెలిసిందే.

Peddapalli: తవ్వకాల తిప్పలు!

  • రేవంత్‌ సర్కారుకు తలనొప్పిగా మారిన గత సర్కారు ఇసుక అక్రమాలు

  • ఆదాయం కోసం నిబంధనలకు విరుద్ధంగా మానేరు వద్ద తవ్వకాలు

  • వాటిని నిలిపివేయాలని ఎన్జీటీ తీర్పు

  • ఇప్పటికే మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖలకు రూ.25 కోట్లచొప్పున జరిమానా

పెద్దపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం చేపట్టిన అక్రమ ఇసుక తవ్వకాల తాలూకు విపరిణామాలు ప్రస్తుత ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ఆదాయమే లక్ష్యంగా గత బీఆర్‌ఎస్‌ సర్కారు నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన ఇసుక తవ్వకాలపై ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ, మైనింగ్‌ శాఖలకు చెనైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌ కోర్టు రూ.25 కోట్ల చొప్పున తాత్కాలిక జరిమానా విధించడం తెలిసిందే. పర్యావరణానికి హాని తలపెట్టేలా మానేరు నదిపై నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, రీచులను రద్దు చేయాలని ప్రజల విజ్ఞప్తులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పలువురు చెన్నై ఎన్జీటీ కోర్టులో పిటిషన్లు వేశారు. విచారించిన కోర్టు, పర్యావరణ అనుమతుల్లేకుండా మానేరు నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టడం తప్పేనంటూ తీర్పులో స్పష్టం చేసింది.


కోర్టు అంతటితో సరిపెట్ట లేదు. పైగా తీర్పుల్లో.. వాణిజ్య అవసరాలకు డ్రెడ్జింగ్‌, ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమనీ ఎన్జీటీ వ్యాఖ్యానించింది. పబ్లిక్‌ ట్రస్ట్‌ సిద్ధాంతాన్ని పాటించడంలో విఫలమైనందువల్లే గనులు, నీటి పారుదల శాఖలు మధ్యంతర పరిహారం చెల్లించాలని వెల్లడించింది. దీంతో పర్యావరణ నష్టం అనే అంశం వల్ల కూడా రేవంత్‌ సర్కారుకు భారీ జరిమానా చెల్లించక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మానేరు నదిపై ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చిన రాయల్టీ, మార్కెట్‌ రేటు, పర్యావరణ నష్టాలను అంచనాలు వేసి వాటిని టీఎ్‌సఎండీసీ నుంచి సేకరించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు నిబంధనల ప్రకారం ఆ నష్టం విలువతో పోల్చి దానికి అదనంగా జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.


విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతోనే

గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఉన్న మానేరు నదిపై 40 వరకు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపడుతున్నందున వాటి లోపల ఉన్న ఇసుకను రెండు మీటర్ల వరకు తోడాల్సి ఉంటుందని, డిసిల్టెషన్‌ పేరిట ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి పర్యావరణ అనుమతులు పొందలేదు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో 25 ఇసుక రీచులను గుర్తించారు. వీటి ద్వారా 1,32,67,620 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడేందుకు గత సర్కారు 2022 జనవరి 11వ తేదీన టీఎ్‌సఎండీసీ టెండర్లను ఆహ్వానించింది. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని ఇసుక రీచ్‌లను దక్కించుకోగా కొన్నింటిలో తవ్వకాలు చేపట్టారు. 2023 డిసెంబరు నెలాఖరు వరకు ఇసుక తవ్వకాలకు డిస్ట్రిక్ట్‌ లెవల్‌ శాండ్‌ కమిటీ (డీఎల్‌ఎ్‌ససీ) అనుమతిచ్చింది. ఆ మేరకు గడువు పూర్తయ్యాక కూడా డంపుల్లో ఉన్న ఇసుకను తరలించారు.


ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని దుమ్మూధూళితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇసుక లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయని మానేరు పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. అప్పటి ప్రభుత్వానికి పలుసార్లు మొరపెట్టుకున్నా కూడా వినకపోవడంతో మానేరు పరిరక్షణ సమితికి చెందిన ప్రతినిధులు న్యాయ పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని భావించారు. ఆ మేరకు గొట్టెముక్కుల సురేశ్‌ రెడ్డి, అంబటి కర్ణాకర్‌ రెడ్డి, నోముల సదాశివరెడ్డి కలిసి రెండు పిటిషన్లు, గడీల రఘువీర్‌రెడ్డి, అంబటి కర్ణాకర్‌రెడ్డి కలిసి ఒక పిటిషన్‌, సంది సురేందర్‌ రెడ్డి, చిటికేసి సతీశ్‌ కుమార్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు పర్యావరణ అనుమతులపై ఎన్జీటీ బెంచ్‌ పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించినప్పటికీ ఇందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం ప్రవేశపెట్టలేదు. గతంలోనే మానేరు ఇసుక తరలింపును నిలిపివేయాలని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


అయినప్పటికీ గత ప్రభుత్వం ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరించింది. దీంతో ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితం ప్రస్తుత ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇరిగేషన్‌, మైనింగ్‌ విభాగాలకు మూడు నెలల్లోగా రూ.25కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ సొమ్మును గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. అలాగే మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. మానేరులోని ఇసుక రీచ్‌ల నుంచి అధికారికంగా సుమారు 1.40 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడి విక్రయించగా, తద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్లపైగా ఆదాయం వచ్చింది. అక్రమంగా మరో 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను కాంట్రాక్టర్లు ఎక్స్‌ట్రా బకెట్ల పేరిట విక్రయించుకున్నారనే ఆరోపణలున్నాయి.

Updated Date - May 27 , 2024 | 03:53 AM