Share News

Group-2 exam: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన..

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:43 AM

గ్రూప్‌-2, 3 పోస్టులు పెంచాలని.. డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.

Group-2 exam: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన..

  • గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్‌

  • గ్రూప్‌ 2 పరీక్ష డిసెంబరులో పెట్టాలని విజ్ఞప్తి

చిక్కడపల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2, 3 పోస్టులు పెంచాలని.. డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు అశోక్‌ నగర్‌ చౌరస్తాలో బైఠాయించారు. ప్లకార్డులు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్‌-1, డీఎస్సీలో పోస్టులు పెంచడం సంతోషమని.. గ్రూప్‌-2, 3లో కూడా పెంచాలని డిమాండ్‌ చేశారు. కొలువులు నింపడంలో కేసీఆర్‌కు కాంగ్రె్‌సకు తేడా ఏం లేదని మండిపడ్డారు. తాము పుస్తకం పట్టుకోవాలా..? కొలువుల కోసం పోరాటం చేయాలా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.


బీఆర్‌ఎస్‌ పాలనలో ఇదే సమస్య అయిందని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా ఇదే సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడానికి తామంతా కష్టపడ్డామని, తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. నిరుద్యోగుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను దారి మళ్లించి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 03:43 AM