Hyderabad: చంద్రబాబుకు ఘన స్వాగతం..
ABN , Publish Date - Jul 06 , 2024 | 03:59 AM
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు శుక్రవారం బేగంపేట విమానాశ్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ దాక భారీ ర్యాలీ
విమానాశ్రయంలోనే.. గజమాలతో సన్మానం
బేగంపేట/బంజారాహిల్స్, జూలై 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు శుక్రవారం బేగంపేట విమానాశ్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7.20కు చంద్రబాబు హైదరాబాద్కు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున డప్పుల మోతలు, కోలాటాలు, నృత్యాల నడుమ నినాదాలు చేశారు. క్రేన్తో భారీ గజమాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు. వారికి అధినేత అభివాదం చేశారు. జోరు వానలోనూ చంద్రబాబును అనుసరిస్తూ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వరకు ర్యాలీగా తరలివెళ్లారు.
కాగా, కటౌట్లు, బ్యానర్లు, పార్టీ జెండాలతో ఈ ప్రాంతమంతా పసుపుమయమైంది. టీటీడీపీ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్కుమార్ గౌడ్, నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు కంభంపాటి రామ్మోహన్రావు, తెలుగు యువత నేత మల్లికార్జున్ నాయుడు, కట్టా రాములు, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ తదితరులు స్వాగతం పలికారు. ర్యాలీ బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్దకు చేరుకున్నప్పుడు బాబును కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. బాణసంచా పేల్చి సందడి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నం.1 నుంచి బాబు నివాసం వరకు పూలు పరిచారు.