Share News

Health Department: వైద్యశాఖలో యూనియన్‌ నేతలకూ బదిలీ!

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:19 AM

రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో బదిలీల్లో ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. ఆఫీస్‌ బేరర్‌ అంటూ లేఖలు తెచ్చుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారందర్నీ.. ఆఖరికి యూనియన్‌ నేతలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.

Health Department: వైద్యశాఖలో యూనియన్‌ నేతలకూ బదిలీ!

  • ఆఫీస్‌ బేరర్‌ లేఖలతో ట్రాన్స్‌ఫర్‌ ఆపుకొన్న వారిపై వైద్యశాఖ కొరడా

  • సుమారు 250 మంది నేతల ఆఫీస్‌ బేరర్‌ లేఖలు రద్దు

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో బదిలీల్లో ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. ఆఫీస్‌ బేరర్‌ అంటూ లేఖలు తెచ్చుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారందర్నీ.. ఆఖరికి యూనియన్‌ నేతలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యారోగ్యశాఖ బదిలీలలో యూనియన్‌ లేఖల పేరిట భారీగా జరిగిన అక్రమాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. బదిలీల నుంచి తమను మినహాయించాలని అయా సంఘాల నుంచి లేఖలు తెచ్చుకుని బదిలీకాకుండా ఉన్న వారిపై కొరడా ఝళిపించింది. సుమారు 250 మంది ఆఫీస్‌ బేరర్‌ల లేఖలను రద్దు చేసింది. వారున్న స్థానం నుంచి వేరేచోటకు బదిలీ చేస్తూ తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


బదిలీల నుంచి వెసులుబాటు పొందేందుకు కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌ బేరర్ల పేరిట టీజీవో, టీఎన్‌జీవో, ఐఎన్‌టీయూసీ యూనియన్‌ల నుంచి లేఖలు తెచ్చుకున్నారు. ఈ లేఖలు ఇచ్చే క్రమంలో పెద్దఎత్తున డబ్బులు వసూ లు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో సర్కా ర్‌ దీనిపై విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే ఆ లేఖలను పరిగణనలోకి తీసుకోవడంలేదని స్పష్టతనిచ్చింది. ప్రధానంగా ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో వివిధ క్యాడర్లకు సంబంధించి బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారిని వేర్వేరు చోట్లకు బది లీ చేసింది.


వారందర్నీ మూడు రోజుల్లోగా తామిచ్చిన పోస్టుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంపీహెచ్‌ఈవో క్యాడర్‌ నుంచి 32 మంది ని బదిలీ చేశారు. వీరంతా సంఘం లేఖలతో బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారేనని వైద్యవర్గాలు తెలిపాయి. ఇదే క్యాడర్‌లోని ఐఎన్‌టీయూసీ యూనియన్‌ నాయకుడు వెంకటేశ్వర్‌ రెడ్డిని వికారాబాద్‌ జిల్లాకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా స్టాఫ్‌నర్స్‌ క్యాడర్‌లో యూనియన్‌ నాయకురాలు సుజాత రాథోడ్‌ను ఉస్మానియా ఆస్పత్రి నుంచి సూర్యాపేట మెడికల్‌ కాలేజీకి బదిలీ చేశారు. వివిధ యూనియన్లకు చెందిన మరో 30 మంది నాయకులనూ జిల్లాలకు పంపించినట్లు తెలిసింది.

Updated Date - Jul 29 , 2024 | 03:24 AM