Share News

Hosipital: టిమ్స్‌ 14 అంతస్తులకే పరిమితం:దామోదర

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:31 AM

హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న నాలుగు టిమ్స్‌(తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఆస్పత్రుల ఎత్తును 14 అంతస్తులకే పరిమితం చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Hosipital: టిమ్స్‌ 14 అంతస్తులకే పరిమితం:దామోదర

హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న నాలుగు టిమ్స్‌(తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఆస్పత్రుల ఎత్తును 14 అంతస్తులకే పరిమితం చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాలుగు ఆస్పత్రులని... ఒక్కో దాంట్లో ఒక్కో ప్రత్యేకత(స్పెషలైజేషన్‌) ఉండేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ వైద్యులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ హయంలో నిబంధనలకు విరుద్ధంగా టిమ్స్‌ ఆస్పత్రులను 24 అంతస్తుల్లో నిర్మిచాలనుకున్నారని విమర్శించారు.


ప్రస్తుతం నిర్మాణ నిబంధనల మేరకే వాటి ఎత్తును తగ్గించినట్లు స్పష్టం చేశారు. ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లో హాస్టల్‌ భవనాలను రెండేళ్లలోపే నిర్మిస్తామని చెప్పారు. ఆ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న... శాఖలోని కీలక విభాగాలకు హెచ్‌వోడీలను నియమించలేదని, ప్రస్తుత ఇన్‌చార్జిల స్థానంలో రెగ్యులర్‌ హెచ్‌వోడీలను సీనియారిటీ, సమర్థత ఆధారంగా నియమిస్తామని వెల్లడించారు.


త్వరలోనే మంత్రివర్గ విస్తరణ!

త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఐదారుగురికి క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశముందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, హైదరాబాద్‌ నుంచి దానం నాగేందర్‌కు, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. సీతక్కకు హోంశాఖ కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.

Updated Date - Jul 02 , 2024 | 03:31 AM