Share News

Osmania Hospital: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్యుల బదిలీలు ఆపండి

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:23 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల బదిలీలను నిలిపివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

Osmania Hospital: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్యుల బదిలీలు ఆపండి

  • వైద్యశాఖ మంత్రి రాజనర్సింహ ఆదేశం ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల బదిలీలను నిలిపివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గాంధీ, ఉస్మానియాల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారమిక్కడ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘డాక్టర్లు ఏరీ’ కథనం చర్చకు వచ్చింది.


రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 80 ప్రకారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో నాలుగేళ్ల సర్వీసు పైబడి, ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల బదిలీలను 40 శాతం మించకుండా చేపట్టినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. బదిలీల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 7 ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషాలిటీ సేవలు అందించేందుకు సగటున 4-5 విభాగాల్లో నిపుణులైన వైద్యుల ఖాళీలున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నెల 10లోగా భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇటు నగరంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 407 పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.


  • 4 ఏళ్లు దాటిన వారే బదిలీ: డీఎంఈ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల బదిలీలపై డీఎంఈ స్పందించారు. ఒకేచోట నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారినే బదిలీ చేశామని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘డాక్టర్లు ఏరీ’ వార్తకు డీఎంఈ ఈ మేరకు వివరణ ఇచ్చారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కొంత మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు, సీనియర్‌ సర్జన్లను బదిలీ చేయలేదని పేర్కొన్నారు.


  • బది’లీలలు’ చూడండి సారూ!

  • వైద్యశాఖ బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వైద్యమంత్రి, సీఎంకు ఫిర్యాదులు..

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీల్లో చోటుచేసుకున్న అక్రమాలు, వసూళ్ల పర్వం, మోడిఫికేషన్‌ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ సర్కారును తెలంగాణ మెడికల్‌ జేఏసీ ప్రతినిఽధి మహాలా డి మాండ్‌ చేశారు. సంఘాల పేరుతో సాధారణ బదిలీ ల నుంచి కొంతమంది డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు పొందారని, దీనిపై విజిలెన్స్‌ విచారణ జరిపి, బాఽధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బాబురావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై పలు వైద్య సంఘాలు, టీ మెడికల్‌ జేఏసీతో పాటు కొందరు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ప్రొఫెసర్లు కూడా ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులను వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కర్ణన్‌, హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూలతో పాటు వైద్య మంత్రి దామోదర, సీఎం రేవంత్‌కు కూడా ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - Aug 06 , 2024 | 03:23 AM