Share News

Nalgonda: విదేశాల్లో ఉపాధి.. పేదరికంతో సమాధి!

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:38 AM

జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని భావించిన తన ఆకాంక్షలకు పేదరికం అడ్డొచ్చిందని.. విదేశాల్లో శిక్షణ, ఉపాధి కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోలేకపోయానన్న ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Nalgonda: విదేశాల్లో ఉపాధి.. పేదరికంతో సమాధి!

  • రైలుకు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య

  • రష్యా వెళ్లేందుకు రెండుసార్లు చాన్సొచ్చినా అడ్డొచ్చిన పేదరికం

  • తండ్రి ఆటో డ్రైవర్‌.. పుట్టని అప్పు

  • ఆవేదనతో సోదరికి మెసేజ్‌ పెట్టి ఆత్మహత్య

  • నల్లగొండ జిల్లా లో విషాద ఘటన

నల్లగొండ టౌన్‌, జూన్‌ 7: జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని భావించిన తన ఆకాంక్షలకు పేదరికం అడ్డొచ్చిందని.. విదేశాల్లో శిక్షణ, ఉపాధి కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోలేకపోయానన్న ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రష్యాలో శిక్షణ పొందేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా ఆ రెండుసార్లు కేవలం డబ్బు లేక అవకాశం చేజారిందన్న ఆవేదనతో దూసుకొస్తున్న రైలుకు ఎదురువెళ్లాడు. రైలు ఢీకొట్టడంతో ముఖం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఐటీ టవర్స్‌ వద్ద ఈ విషాద ఘటన జరిగింది. మృతుడు 20 ఏళ్ల కొడిదల శివమణి చందనపల్లి గ్రామ వాస్తవ్యుడు. తండ్రి శంకర్‌ ఆటో డ్రైవర్‌. శంకర్‌కుశివమణితో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లయింది. శివమణి వికారాబాద్‌లో అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తిచేశాడు. మూడు నెలలుగా శంకర్‌పల్లిలోనే ఉంటూ సమీపంలోని వ్యవసాయ సంబంధిత పరిశ్రమలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన టాంకాం కంపెనీ ద్వారా బీఎస్సీ నర్సింగ్‌లో ఉపాధి శిక్షణ కూడా పొందాడు. ఆ శిక్షణ ద్వారా రష్యాలో ఉపాధి అవకాశం కల్పించడం కోసం నోటిఫికేషన్‌ వెలువడింది.


శివమణి దరఖాస్తు చేసుకోగా అందులో సెలెక్ట్‌ అయ్యాడు. శిక్షణతో పాటు వీసాకు రూ.3.5లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అవసరపడ్డాయి. కుమారుడి కోసం డబ్బు సమకూర్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించినా ఎక్కడా అప్పు పుట్టలేదు. ఆరు రోజుల క్రితం శివమణి సొంతూరొచ్చాడు. తండ్రి శంకర్‌ డబ్బుల కోసం నాలుగు రోజులుగా ప్రయత్నం చేసినా ఎక్కడా అప్పు పుట్టలేదు. ఆరు నెలల క్రితం కూడా రష్యాలో బీఎస్సీ నర్సింగ్‌ చేసేందుకు శివమణి ప్రయత్నించగా సీటు లభించింది. ఆ సమయంలోనూ డబ్బులు అందకపోవడంతో వెళ్లలేకపోయాడు. ఇలా రెండుసార్లు విఫలమవటంతో మనోవేదనకు గురైన శివమణి శుక్రవారం ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. నల్లగొండ-శీరాంపురం మధ్యలో ఐటీ టవర్స్‌ వద్ద గూడ్స్‌ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ‘అక్కా.. క్షమించు. నేను చనిపోతున్నా’ అంటూ తన సోదరి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పెట్టాడు. ఆత్మహత్య చేసుకుంటున్న లొకేషన్‌ను షేర్‌ చేశాడు. ఆమె వెంటనే తండ్రికి సమాచారమివ్వటంతో ఆయన ఆటోలో అక్కడికి వెళ్లగా అప్పటికే శివమణి పట్టాల పక్కన విగతజీవిగా పడి ఉన్నాడు. కుమారుడి మృతితో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Jun 08 , 2024 | 04:38 AM