Share News

Indian Railways: ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్‌

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:54 AM

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్‌ కార్యాలయం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Indian Railways: ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్‌

  • కొత్తగా దక్షిణ కోస్తా జోన్‌.. విశాఖ కేంద్రంగా కార్యాలయం

  • సికింద్రాబాద్‌, ఒడిసాలో కలిసిన ఏపీ ప్రాంతాలన్నీ దీని కిందే..

  • వాల్తేరు డివిజన్‌ రద్దుకు స్వస్తి.. ఇక విశాఖ డివిజన్‌గా..

  • కేంద్రంపై ఫలించిన కూటమి ఎంపీల ఒత్తిడి

విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్‌ కార్యాలయం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనేక తర్జనభర్జనలు, చర్చలు, ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్‌ను ఏపీ కోసం ఏర్పాటుచేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఏపీ పరిధిలో పని చేస్తున్న డివిజన్లు కోతలకు, కుదింపులకు, మార్పులకు గురి కానున్నాయి. దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన కేంద్రంపై కూటమి ఎంపీల ఒత్తిడి ఫలించింది. ఈ డివిజన్‌ను ఇకపై విశాఖపట్నం డివిజన్‌గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై నిజానికి గత నెల 10వ తేదీనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆ వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్‌ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్‌లోను, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోను ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలోని ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా జోన్‌’ ఏర్పాటుచేశారు. ఇందులో విశాఖపట్నం, (పాత వాల్తేరులో కొంత భాగం), విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఉంటాయి.


ఇదీ నేపథ్యం..

విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్‌ ఇస్తామని ఐదేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. నెల రోజుల క్రితం(జనవరి 8న) జోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోన్‌ ఏర్పాటులో భాగంగా 130 ఏళ్లుగా నడుస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు చాలాకాలం క్రితమే కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధిక ఆదాయం సమకూర్చే పది డివిజన్లలో వాల్తేరు ఒకటి. ఏడాదికి రూ.10వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. దీనిని రద్దు చేస్తే విశాఖ జోన్‌కే అర్థం ఉండదని, ఆ డివిజన్‌ లేకుండా జోన్‌ అవసరం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మరో వైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ వాల్తేరు డివిజన్‌ ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కేబినెట్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టి రైల్వే బోర్డు ఇంకో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌ కొనసాగిస్తామని చెబుతూ, దానిని ఇకపై ‘విశాఖ డివిజన్‌’గా వ్యవహరిస్తామని వెల్లడించింది.


కుదింపులు.. పొడిగింపులు..

వాల్తేరు రైల్వే డివిజన్‌ 1893లో ఏర్పాటైంది. దీని పరిధిలో దువ్వాడ-విశాఖపట్నం-పలాస మెయిన్‌ లైన్‌ 213 కిలోమీటర్ల మేర ఉంది. ఆర్‌వీ లైన్‌గా వ్యవహరించే రాయగడ-విజయనగరం-సింగాపురం రోడ్‌-తేరుబడి మార్గం 137 కిలోమీటర్లు, కేకే లైన్‌గా వ్యవహరించే కొత్తవలస-కిరండూల్‌ మార్గం పొడవు 446 కిలోమీటర్లు, కేఆర్‌ లైన్‌గా వ్యవహరించే కొరాపుట్‌-రాయగడ మార్గం 164 కిలోమీటర్లు, ఇవి కాకుండా కొత్తవలస-సింహాచలం 22 కిలోమీటర్లు, బొబ్బిలి-సాలూరు 18 కిలోమీటర్లు, నౌపడ-గుణుపూర్‌ లైన్‌ 90 కిలోమీటర్లు....కలిపి మొత్తం 1,052 కిలోమీటర్ల రైల్వే లైన్‌ వాల్తేరు డివిజన్‌లో ఉంది. ఇందులో కొత్తవలస-కిరండూల్‌, కూనేరు-తెరువలి జంక్షన్‌, సింగాపూర్‌ రోడ్‌-కోరాపుట్‌ జంక్షన్‌, పర్లాకిమిడి-గుణుపూర్‌ మార్గాలను...సుమారు 680 కిలోమీటర్ల లైన్‌ను తీసుకువెళ్లి కొత్తగా ఒడిశాలో ఏర్పాటుచేసిన రాయగడ డివిజన్‌లో కలిపేశారు. మిగిలిన ప్రాంతాలతో వాల్తేరు డివిజన్‌ 410 కిలోమీటర్లకు కుదించుకు పోయింది. దీనిని విశాఖపట్నం డివిజన్‌గా వ్యవహరిస్తారు. అయితే, గుంతకల్లు రైల్వే డివిజన్‌ కొంతమేర కోతకు గురైంది. ఈ డివిజన్‌లోని రాయచూరు-నాల్వార్‌ రైల్వే సెక్షన్‌ సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌లోకి మారింది. అయితే, సౌత్‌ కోస్టు రైల్వే జోన్‌ ఏర్పాటు వల్ల విశాఖపట్టణం-విజయవాడ-గుంతకల్లు రైల్వే డివిజన్ల మధ్య కనెక్టివిటీ, ట్రాఫిక్‌ పెరుగుతుంది. దీని వల్ల రాష్ట్ర రాజధానికి రైళ్లు లేక ఇబ్బందిపడుతున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ ప్రయాణికులకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు మేలు జరగనుంది. కాగా, విజయవాడ డివిజన్‌ను నౌపడ వరకు పొడి గిస్తూ పాత డీపీఆర్‌లో పొందుపరిచారు. తాజాగా విశాఖ డివిజన్‌ను (కొన్ని కుదింపులతో పూర్వ వాల్తేరు డివిజన్‌) ప్రకటించడం వల్ల తిరిగి దువ్వాడ వరకు విజయవాడ డివిజన్‌ (పాత రూట్‌) పరిమితం కానుంది. అమరావతి రైల్వే లైన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి వరకు ఉన్న 65 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను విజయవాడ డివిజన్‌లో కలపనున్నారు.


జగన్‌ మద్యం దోపిడీపై ‘సిట్‌’

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో అడ్డగోలుగా మద్యం దోపిడీ చేసిన కుంభకోణం మూలాలను తవ్వి తీసేదిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని 2019 అక్టోబరు నుంచి నిరుడు మార్చి వరకు దోచేసిన వేల కోట్లకు సంబంధించిన అసలు లబ్ధిదారులకు ఉచ్చు బిగించే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై విజయవాడ పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు (ఐజీ ర్యాంకు) సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. ఈ కుంభకోణంలో నెలకు రూ.60 కోట్ల చొప్పున మూడు కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే ఆధారాలు సంపాదించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..

Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..

Updated Date - Feb 06 , 2025 | 03:54 AM

News Hub