Hyderabad: వైవీ సుబ్బారెడ్డి మా భూములు ఆక్రమిస్తున్నారు..
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:56 AM
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతా రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఈ అంశంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.

పోలీసులు సహకరిస్తున్నారు.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతా రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఈ అంశంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కొప్పుల మల్లారెడ్డి, జీ నర్సింహారెడ్డి, షేక్ ఇస్లాముద్దీన్ అనే వ్యక్తులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామ పరిధి సర్వే నెంబర్ 87లోని 5.04 ఎకరాల భూమిపై తమకు అనుకూలంగా సివిల్ కోర్టు తీర్పు ఉన్నా పోలీసులు అండతో సుబ్బారెడ్డి దంపతులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు.
వైవీ సుబ్బారెడ్డి దంపతుల తరఫున సీనియర్ న్యాయవాది వివేక్రెడ్డి వాదిస్తూ.. సదరు భూమిపై తమకే టైటిల్ ఉందని, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా భూమి కొనుగోలు చేశారని తెలిపారు. పిటిషనర్ల దగ్గర ఎలాంటి రిజిస్టర్డ్ పత్రాలు లేవన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోరాదని.. అయితే శాంతిభద్రతలకు భంగం కలిగితే చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.