Chandrababu: సర్పంచులతో చంద్రబాబు సమావేశం.. ఆవేదనను బయటపెట్టిన పలువురు సర్పంచులు

ABN , First Publish Date - 2023-08-17T13:13:30+05:30 IST

జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం మండపేటలో పర్యటించిన టీడీపీ చీఫ్.. సర్పంచులతో సమావేశం నిర్వహించారు.

Chandrababu: సర్పంచులతో చంద్రబాబు సమావేశం.. ఆవేదనను బయటపెట్టిన పలువురు సర్పంచులు

అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (TDP Chief Chandrababu Naidu) పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం మండపేటలో పర్యటించిన టీడీపీ చీఫ్.. సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 13 వేల మంది సర్పంచులు ప్రజలు కోసం పనిచేయాలన్నారు. సర్పంచులు హక్కులను జగన్ కాలరాస్తున్నారని మండిపడ్డారు. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని చెప్పారు. 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు.


ఈ సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు తమ ఆవేదనను చంద్రబాబు ముందు ఉంచారు. వైసీపీ నేతలు, వలంటీర్ల వల్ల తాము పడుతున్న బాధలను టీడీపీ చీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. రాజోలు, మలికిపురం మండలం కేశనపల్లి సర్పంచ్ తన ఆవేదనను బయటపెట్టారు. వాలంటీర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారారన్నారు. సర్పంచులు చేస్తున్న ఉద్యమాన్ని జగన్ పట్టించుకోవటం లేదని కపిళేశ్వరపురం మండలం వల్లూరు మహిళా సర్పంచ్ ఆవేదన చెందారు. వాలంటీర్ల వ్యవస్థ ఉగ్రవాదంలా మారిందని.. హక్కుల కోసం మాట్లాడితే వాలంటీర్లు భయపడుతున్నారని రాజోలు నియోజకవర్గం విశ్వేశ్వరపురం సర్పంచ్ చెల్లుబోయిన వేణి తెలిపారు. సర్పంచులను వైసీపీ నేతలు భయపెడుతున్నారని మలికిపురం మండలం దిండి సర్పంచ్ వాపోయారు. సైకో ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపి పంచాయతీల హక్కులను కాపాడాలని మండపేట నియోజకవర్గం కపిళేశ్వరపురం సర్పంచ్ కోరారు.

Updated Date - 2023-08-17T13:14:43+05:30 IST