Vande Bharat train: కాచిగూడ - యశ్వంతపుర మధ్య ‘వందేభారత్‌’ ట్రయల్‌రన్‌

ABN , First Publish Date - 2023-09-22T12:24:41+05:30 IST

బెంగళూరులోని యశ్వంతపుర - హైదరాబాద్‌లోని కాచిగూడ(Yeswantapura in Bengaluru - Kachiguda in Hyderabad) రైల్వేస్టేషన్‌ల

Vande Bharat train: కాచిగూడ - యశ్వంతపుర మధ్య ‘వందేభారత్‌’ ట్రయల్‌రన్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని యశ్వంతపుర - హైదరాబాద్‌లోని కాచిగూడ(Yeswantapura in Bengaluru - Kachiguda in Hyderabad) రైల్వేస్టేషన్‌ల మధ్య వందేభారత్‌ రైలు ట్రయల్‌రన్‌ గురువారం జరిపింది. కాచిగూడలో బయల్దేరిన ఈ రైలు మధ్యాహ్నం 1.15 గంటలకు యశ్వంతపుర రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలు 4వ నెంబరు ప్లాట్‌ఫాంపైకి వస్తూనే ప్రయాణీకులు ఒక్కసారిగా రైలు వద్ద నిలబడి సెల్ఫీలు దిగారు. ఈ రైలుకు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 24న పచ్చజెండా చూపే అవకాశం ఉన్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఒకేరోజు 9 మార్గాల్లో వందేభారత్‌ రైళ్లను ప్రధాని వర్చువల్‌ ద్వారా ప్రారంభించనున్నారు. వందేభారత్‌ కాచిగూడ - యశ్వంతపురల మధ్య 610 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.30 గంటల్లో చేరుకుంది. మహబూబ్‌నగర్‌, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్‌(Mahabubnagar, Kurnool City, Anantapur and Dharmavaram stations)లలో ఆగింది.

ఇది ప్రతిరోజూ కాచిగూడ - యశ్వంతపురల మధ్య సంచరించనుంది. ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45కు బయల్దేరి అదే రోజు రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకోనుంది. కర్ణాటకకు సంబంధించినంతవరకు ఇది మూడో వందేభారత్‌ రైలు కానుంది. 2022 నవంబరులో మైసూరు - చెన్నైల మధ్య బెంగళూరు మీదుగా తొలి వందేభారత్‌ రైలును ప్రారంభించగా ప్రస్తుత ఏడాది జూన్‌లో బెంగళూరు సిటీ - ధారవాడల మధ్య రెండో వందేభారత్‌ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ - బెంగళూరు నగరాల మధ్య ప్రయాణీకుల రాకపోకలు అధికంగా ఉండడంతో వందేభారత్‌ రైలుకు డిమాండ్‌ ఉంటుందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రైలు వల్ల కర్ణాటకకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాచిగూడ - యశ్వంతపురల మధ్య రైళ్ల ప్రయాణదూరం ప్రస్తుతం 12 గంటలుగా ఉంది. వందేభారత్‌ రైలుతో సమయం మూడున్నర గంటలు తగ్గుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2023-09-22T12:24:41+05:30 IST