Jaahnavi Kandula Case: ‘జాహ్నవి’ ఘటనపై భారత్‌ మండిపాటు.. వైట్‌‌హౌస్‌ స్పందన ఇదీ..!

ABN , First Publish Date - 2023-09-15T07:49:02+05:30 IST

విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. అటు అమెరికా ఇటు భారత్‌లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. దీనిపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్‌ కార్యాలయం తీవ్రంగా స్పందించింది.

Jaahnavi Kandula Case: ‘జాహ్నవి’ ఘటనపై భారత్‌ మండిపాటు.. వైట్‌‌హౌస్‌ స్పందన ఇదీ..!

క్రూర పోలీసుపై శ్వేతసౌధానికి ఫిర్యాదు..

చర్యలు తీసుకుంటాం: వైట్‌ హౌస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 : విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. అటు అమెరికా ఇటు భారత్‌లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. దీనిపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్‌ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. దౌత్యాధికారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ ఈ విషయాన్ని వాషింగ్టన్‌ డీసీలోని సీనియర్‌ అధికారులు సహా సియాటెల్‌, వాషింగ్టన్‌ రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. జాహ్నవి కేసుపై పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో స్పందించిన అధ్యక్షుడు బైడెన్‌ బృందంలోని సీనియర్‌ అధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని సంధూకు హామీ ఇచ్చారు. ఏపీలోని కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్లారు. ఈ ఏడాది జనవరి 23న సౌత్‌లేక్‌ యూనియన్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలిలోనే మరణించారు.

ఆ సమయంలో ఆ వాహనాన్ని కెవిన్‌ డేవ్‌ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. దర్యాప్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారి డానియల్‌ ఆడెరెర్‌ అక్కడే జోకులు వేయడం, నవ్వడం అతని బాడీకామ్‌ కెమెరాలో రికార్డయ్యింది. ఘటన స్థలం నుంచే సియాటెల్‌ పోలీసు ఆఫీసర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు మైక్‌ సోలెన్‌కు డానియల్‌ ఫోన్‌ చేసి.. ప్రమాద వివరాలు తెలియజేశారు. ‘ఆమె చనిపోయింది’ అని నవ్వడం, ‘ఆమె మామూలు మనిషే. 11 వేల డాలర్ల చెక్కు రాయండి చాలు’ అంటూ నవ్వడం రికార్డయ్యాయి. అంతేకాక ‘వయసు 26 ఉండొచ్చు. ఆమె జీవితానికి విలువ తక్కువ’ అన్నారు. డ్రైవర్‌ తప్పు లేదని, క్రిమినల్‌ దర్యాప్తు అక్కర్లేదని తెలిపారు.

కుమిలిపోతున్న జాహ్నవి కుటుంబం

దర్యాప్తు అధికారి డానియల్‌ మాటలు విని భారత్‌లోని జాహ్నవి కుటుంబసభ్యులు మాన్పడిపోయారు. ‘మేం మా బిడ్డను కోల్పోయాం. కానీ ఇది మమ్మల్ని అంతకుమించిన కుంగుబాటుకు గురిచేసింది’ అని జాహ్నవి తాతయ్య వాపోయారు. జాహ్నవి ప్రాణానికి విలువ లేదా అని ప్రశ్నించారు. జాహ్నవి జనవరిలో చనిపోతే నివేదిక ఇప్పుడు బయట పెట్టడమేంటని ప్రశ్నించారు. జాహ్నవి తల్లి రెండ్రోజులుగా షాక్‌లో ఉన్నారని, ఆహారం తీసుకోవడం లేదని మీడియా వద్ద కన్నీరు పెట్టుకున్నారు.

అప్పుడు వాహన వేగం 119 కి.మీ.

జాహ్నవిని ఢీకొట్టే సమయానికి పెట్రోలింగ్‌ వాహనం 119 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. సరిగ్గా ఘటన సమయానికి స్పీడో మీటరులో 101 కిలోమీటర్లు చూపించింది. జీబ్రాలైన్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి వాహనం తగిలిన ధాటికి 138 అడుగుల అవతల ఎగిరిపడ్డారు. ఈ మార్గంలో 40 కిమీలకి మించి వేగం దాటరాదు. అయితే, వాహనం నడిపిన పోలీసు అధికారి తప్పేం లేదన్నట్టు డానియల్‌ నివేదిక ఇచ్చారు.

Updated Date - 2023-09-15T07:56:49+05:30 IST