ODI World cup: మరికాసేపట్లో టీమిండియా ప్రపంచకప్ జట్టు ప్రకటన? ఆ ఇద్దరిపై వేటు!

ABN , First Publish Date - 2023-09-03T15:28:01+05:30 IST

వన్డే ప్రపంచకప్ కోసం మరికాసేపట్లో భారత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ ప్రపంచకప్ కోసం జట్లన్నీ తమ ఆటగాళ్ల వివరాలను ఐసీసీకి అందించడానికి సెప్టెంబర్ 5 చివరి తేదీగా ఉంది.

ODI World cup: మరికాసేపట్లో టీమిండియా ప్రపంచకప్ జట్టు ప్రకటన? ఆ ఇద్దరిపై వేటు!

వన్డే ప్రపంచకప్ కోసం మరికాసేపట్లో భారత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ ప్రపంచకప్ కోసం జట్లన్నీ తమ ఆటగాళ్ల వివరాలను ఐసీసీకి అందించడానికి సెప్టెంబర్ 5 చివరి తేదీగా ఉంది. ఇప్పటికే దాదాపు టోర్నీలో పాల్గొనే జట్లన్నీ తమ ఆటగాళ్లను ఎంపిక చేశాయి. కానీ ఇప్పటివరకు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించలేదు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా స్క్వాడ్‌ను నేడే ప్రకటించనున్నారు. పైగా గతంలోనే పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే టీమిండియా వన్డే ప్రపంచకప్ జట్టును ప్రకటిస్తారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేడు ఏ క్షణంలోనైనా టీమిండియా స్క్వాడ్ గురించిన ప్రకటన వెలువడొచ్చని సమాచారం. ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శ్రీలంకకు వెళ్లి జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్‌ను కూడా ఖరారు చేశారని సమాచారం. ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన జట్టునే కొనసాగించే అవకాశాలున్నాయి. కాగా ఆసియా కప్‌నకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించిన సమయంలోనే వన్డే ప్రపంచకప్ జట్టును కూడా అందులో నుంచే ఎంపిక చేస్తామనే సంకేతాలను అగార్కర్ ఇచ్చాడు.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచకప్‌నకు 15 మందితో కూడిన జట్టునే ఎంపిక చేయాలి కాబట్టి.. ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన 17 మందితో కూడిన జట్టు నుంచి ఇద్దరిని తొలగించి టీమిండియా స్క్వాడ్‌ను ఖరారు చేశారు. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణను తొలగించి మిగతా టీంను యథావిధిగా ప్రపంచకప్‌నకు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించని కారణంగా ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన రాహుల్ నేడు శ్రీలంకకు బయలుదేరాడు. దీంతో రాహుల్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కిందని తెలుస్తోంది. ఇక వన్డేల్లో సరైన ప్రదర్శన చేయలేక పోతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు అతన్ని కూడా ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారని సమాచారం. ప్రపంచకప్ జట్టులో చోటు ఆశించిన చాహల్‌కు నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. ఆసియా కప్‌నకు బ్యాకప్‌గా ఎంపికైన సంజూ శాంసన్‌కు కూడా వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదని తెలుస్తోంది. ఇక పలు మీడియా కథనాల్లో ఉన్న వివరాల ప్రకారం ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత జట్టు ఈ విధంగా ఉండే అవకాశాలున్నాయి.

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

Updated Date - 2023-09-03T15:28:01+05:30 IST