Share News

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

ABN , Publish Date - Jun 28 , 2024 | 08:46 PM

మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు.

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం
CM Nara Chandrababu Naidu

అమరావతి: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలతో ఎయిమ్స్ సతమతం అయిందని చెప్పారు. సీఎం చంద్రబాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ డా.మధబానందకర్ ఈరోజు(శుక్రవారం) భేటీ అయ్యారు. ఎయిమ్స్ సమస్యలను సీఎంకు వివరించినట్లు డెరెక్టర్ తెలిపారు.


సీఎంతో సమావేశంలో చర్చించిన విషయాలను మీడియాకు ఎయిమ్స్ డైరెక్టర్ డా.మధబానందకర్ వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలోఎయిమ్స్ సమస్యలు పరిష్కారం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తీవ్ర నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నామని డైరెక్టర్ తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి తలపెట్టిన పైప్ లైన్ పనులు కూడా ఆగిపోయాయని అన్నారు. రోజుకు 7 ఏఎల్డీ నీరు అవసరం పడగా...ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా కేవలం 2 ఎంఎల్డీ నీరు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు.


అటవీ భూమిగుండా పైప్ లైన్ నిర్మాణం విషయంలో సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఉన్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆస్పత్రి కోసం 192 ఎకరాలకు గానూ 182 ఎకరాలు ఇచ్చారని మరో 10 ఎకరాలు ఇస్తే ఎయిమ్స్ విస్తరణ పనులు చేస్తామని వెల్లడించారు. ఆస్పత్రిలో అందుతున్న సదుపాయాలపై ఒకసారి వచ్చి పరిశీలించాలని సీఎం చంద్రబాబుకి ఆహ్వానించినట్లు తెలిపారు.


ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం కనీసం నీటి సమస్య తీర్చకపోవడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారని అన్నారు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో ఎయిమ్స్‌కు తాగునీటి సరఫరా చేసే పనులు నిలిచిపోవడం సరికాదని సీఎం అన్నారని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎయిమ్స్ డైరెక్టర్ డా.మధబానందకర్ పేర్కొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 08:46 PM