Share News

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:45 PM

విశాఖ లాసన్స్‌బే కాలనీలోని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..
MVV Satyanarayana

విశాఖ: మాజీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధురవాడ భూమి కొనుగోలు కేసులో తనిఖీలు చేపట్టిన అధికారులు ఏకకాలంలో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి. హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. రూ.12.5 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.


కేసు విచారణలో భాగంగా ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. మరోవైపు హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌ ఓనర్‌ రాధారాణి, కంపెనీ ఎండీ జగదీశ్వరుడు ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ కేసు నమోదు చేయగా.. తాజాగా ఎంవీవీ ఆడిటర్‌ వెంకటేశ్వరరావుతోపాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. అధికారులు ఎంవీవీ ఇంటికి తాళాలు వేసి మరీ తనిఖీ చేపట్టారు. అయితే మాజీ ఎంపీ ప్రస్తుతం ఇంట్లో లేరని అధికారులు చెబుతున్నారు. అయితే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో పలు చిత్రాలు నిర్మించారు. గీతాంజలి, అభినేత్రి, నీవెవరు సినిమాలను ఆయన నిర్మించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ABN Effect: విశాఖ శారదా పీఠంకు కేటాయించిన స్థలం అనుమతి రద్దు

YS Jagan: చేసిదంతా చేసి.. నీతులు చెబుతున్నారా..!

Updated Date - Oct 19 , 2024 | 12:50 PM