Share News

హైదరాబాద్‌ గాలి నాణ్యత భేష్‌!

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:52 AM

హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగైంది. 2017-18తో పోలిస్తే 20-30 శాతం మెరుగుదల సాధించింది. నల్గొండలో కూడా వాయు కాలుష్యం తగ్గింది.

హైదరాబాద్‌ గాలి నాణ్యత భేష్‌!

  • 2017-18తో పోలిస్తే 30% తగ్గిన వాయు కాలుష్యం

  • నల్గొండకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ అవార్డు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగైంది. 2017-18తో పోలిస్తే 20-30 శాతం మెరుగుదల సాధించింది. నల్గొండలో కూడా వాయు కాలుష్యం తగ్గింది. దేశవ్యాప్తంగా నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) పరిధిలోని 131 నగరాల్లో 95 నగరాలు గాలి నాణ్యతలో మెరుగుదల సాధించాయని, 21 నగరాల్లో వాయుకాలుష్యం 2017-18తో పోలిస్తే పీఎం10 స్థాయిలో 40 శాతానికిపైగా తగ్గిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా డేటా వెల్లడించింది. హైదరాబాద్‌, నల్గొండతోపాటు ఏపీలోని ఎనిమిది నగరాల్లోనూ గాలి నాణ్యత మెరుగైందని పేర్కొంది. వాయు కాలుష్యం40 శాతానికిపైగా తగ్గిన 21 నగరాల జాబితాలో ఏపీలోని కడప ఉంది.

30-40శాతం మెరుగుదల కనబర్చిన 14 నగరాల్లో విజయవాడ, 20-30శాతం మెరుగుదల సాధించిన 21 నగరాల్లో కర్నూలు, అనంతపురంతోపాటు హైదరాబాద్‌ కూడా చోటు దక్కించుకుంది. ఇదిలా ఉండగా, ఇంటర్నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ డే సందర్భంగా జైపూర్‌లో శనివారం నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2024 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ సిటీ అవార్డులను ప్రదానం చేసింది. 3 లక్షల్లోపు జనాభా గల నగరాల్లో గాలి నాణ్యత మెరుగుదలలో నల్లగొండ రెండో స్థానం దక్కించుకుంది. రాయ్‌బరేలీ మొదటి స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో నల్లగొండ మునిసిపాలిటీకి రూ.25 లక్షల నగదు పురస్కారం అందించారు. కేంద్ర మంత్రి భూపేందర్‌, రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ చేతుల మీదుగా నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌ అవార్డును స్వీకరించారు.

Updated Date - Sep 09 , 2024 | 03:53 AM