Share News

Bandi Sanjay : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్‌ఎస్‌ విలీనం!

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:33 AM

‘‘అతి త్వరలోనే కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ విలీనం కానుంది. కేసీఆర్‌కు ఏఐసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వనుంది.

Bandi Sanjay : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్‌ఎస్‌ విలీనం!

  • కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌,

  • హరీశ్‌కు మంత్రి, కవితకు రాజ్యసభ ఖాయం

  • కవిత బెయిల్‌తో మా పార్టీకి ఏం సంబంధం?

  • ఆప్‌ విలీనంతోనే సిసోడియాకు బెయిల్‌ వచ్చిందా?

  • బాధ్యత లేకుండా కోర్టులపై బురద జల్లడం దుర్మార్గం

  • దమ్ముంటే అవినీతి కేసుల్లో కేసీఆర్‌ను జైలులో పెట్టండి

  • రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సంజయ్‌ ధ్వజం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘అతి త్వరలోనే కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ విలీనం కానుంది. కేసీఆర్‌కు ఏఐసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వనుంది. తెలంగాణ నుంచి కవితను రాజ్యసభకు పంపినా ఆశ్చర్యం లేదు’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేసిన కాసేపటికే బండి సంజయ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కానుందని, ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్‌ రానుందని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘కవితకు బెయిల్‌ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయస్థానం పరిధిలోని అంశం. కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? ఆమ్‌ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ వచ్చిందా? ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానాలపై బురద చల్లడం దుర్మార్గం’’ అని వ్యాఖ్యానించారు.

బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎ్‌సది ముగిసిన అధ్యాయమని, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎ్‌సను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్సే తహతహలాడుతోందని, పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోందని ఆరోపించారు.

గతంలోనూ పొత్తు పెట్టుకొని, మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర ఆ రెండు పార్టీలకు ఉందని గుర్తు చేశారు. కాళేశ్వరంలో అవినీతి, డ్రగ్స్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతలను జైలుకు పంపే అవకాశం ఉన్నా, కాంగ్రెస్‌ కాపాడుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తీరు ‘‘నువ్వు కొట్టినట్లు చేయ్‌... నేను ఏడ్చినట్లు చేస్తా’’ అన్నట్టుగా ఉందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలకు దమ్ముంటే కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. కాగా, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద బండి సంజయ్‌ నివాళులర్పించారు. వాజ్‌పేయి జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Updated Date - Aug 17 , 2024 | 05:33 AM